RCB vs KKR: సెంచరీతో చెలరేగిన కోహ్లీ: కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు?
ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లీ అజేయ శతకంతో కదం తొక్కడంతో కోల్కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఛేదించింది. ఈ విక్టరీతో బెంగళూరు పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ, గుజరాత్ రెండు జట్లూ 16 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ.. మెరుగైన నెట్ రన్రేట్ కారణంగా బెంగళూరు టాప్ ప్లేస్ను దక్కించుకుంది.
కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్
భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జాకబ్ బెథెల్ (15) కార్తీక్ త్యాగి బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దేవదత్ పడిక్కల్ (39)తో కలిసి రెండో వికెట్కు 92 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ (11), టిమ్ డేవిడ్ తక్కువ పరుగులకే ఔటయినప్పటికీ.. కోహ్లీ మాత్రం పట్టు వదలకుండా 60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్లో కోహ్లీకి ఇది 9వ సెంచరీ కావడం విశేషం.

కేకేఆర్ బ్యాటింగ్ - అంగ్క్రిష్, రింకూ పోరాటం:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్కు ఆరంభం ఆశాజనకంగా లేదు. ఫిన్ అలెన్ (18) భువనేశ్వర్ కుమార్ స్వింగ్ బౌలింగ్కు దొరికిపోగా.. కెప్టెన్ అజింక్య రహానే (19) జోష్ హేజిల్వుడ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ దశలో అంగ్క్రిష్ రఘువంశీ (71), కెమెరాన్ గ్రీన్ (32) జట్టును ఆదుకున్నారు. చివర్లో రింకూ సింగ్ (49 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో భువీ, హేజిల్వుడ్, రసిఖ్ సలాం తలో వికెట్ తీశారు.
ప్లేఆఫ్స్ లెక్కలు - కేకేఆర్ కష్టాల్లో..
ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. కింగ్ కోహ్లీ ఫామ్లోకి రావడం ఆ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ఈ ఓటమి కోల్కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. రహానే సేన ఇప్పుడు టోర్నీలో నిలవాలంటే మిగిలిన మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. రాయ్పూర్ స్టేడియంలో కోహ్లీ నామస్మరణతో గ్యాలరీలన్నీ హోరెత్తిపోయాయి.
14 వేల పరుగుల క్లబ్లో విరాట్
కింగ్ కోహ్లీ కేవలం 58 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో తన సెంచరీ మార్కును చేరుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో 14 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్గా రన్ మెషీన్ కింగ్ కోహ్లీ చారిత్రాత్మక రికార్డు సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన 6వ బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.ఒక ఐపీఎల్ సీజన్లో 400 కంటే ఎక్కువ పరుగులు సాధించడం కోహ్లీకి ఇది 12వ సారి. ఐపీఎల్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా ఇన్ని సీజన్లలో 400+ పరుగులు చేయలేదు. ఈ జాబితాలో కోహ్లీ తర్వాత డేవిడ్ వార్నర్, సురేష్ రైనా తలో 9 సార్లు ఈ ఫీట్ సాధించి రెండో స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కూడా 9 సార్లు ఈ మార్కును అందుకున్నప్పటికీ.. కోహ్లీ 12 సార్లు సాధించి తన నిలకడను మరోసారి చాటుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications