స్కోర్ చూడాలంటేనే భయం పుట్టించారు కదరా
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో దారుణ పరాజయానికి అడుగు దూరంలో నిలిచింది భారత్. ఇప్పటికే తొలి టెస్ట్ లో ఘోరంగా ఓడిపోయింది. ప్రత్యర్థి నిర్దేశించిన 124 పరుగులను కూడా అందుకోలేక చాపచుట్టేసింది. 93 పరుగులకే చతికిలపడింది. గువాహటిలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లోనూ అవే సన్నివేశాలు రిపీట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది.
గెలవడానికి 549 పరుగులు చేయాల్సిన దశలో రెండో ఇన్నింగ్ లో నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి రెండు వికెట్లను కోల్పోయింది టీమిండియా. 27 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో చివరిరోజు అంతే దారుణంగా ఇన్నింగ్ ను ఆరంభించింది. ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. నైట్ వాచ్ మెన్ కుల్ దీప్ యాదవ్ తొలుత బలి అయ్యాడు. సైమన్ హార్మర్ సంధించిన క్వికర్ ను అర్థం చేసుకోలేకపోయాడు కుల్ దీప్ యాదవ్. లోపిచ్ గా వచ్చిన ఆ డెలివరీని ఆడటంలో విఫలం అయ్యాడు. నేరుగా అది వికెట్లను గిరాటేసింది.

దీంతో 40 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత్. ఆ తర్వాత వచ్చిన జురేల్ కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిల్చోలేకపోయాడు. మూడంటే మూడే బంతులు ఆడి అవుట్ అయ్యాడు. అతను చేసింది రెండు పరుగులే. వికెట్లకు కాస్త దూరంగా వేసిన బంతిని డిఫెండ్ ఆడటానికి ప్రయత్నించాడు జురెల్. అతను అనుకున్నంతగా టర్న్ కాలేదా బంతి. నేరుగా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్ వైపు గాల్లోకి లేచింది. దీన్ని అద్భుతంగా అదుకున్నాడు ఎయిడెన్ మార్క్ రమ్. దీంతో 42 పరుగులకు నాలుగో వికెట్ పడింది.
కేప్టెన్ రిషభ్ పంత్ కూడా త్వరగా అవుట్ అయ్యాడు. హార్మర్ బౌలింగ్ లోనే అతనూ పెవిలియన్ దారి పట్టాడు. జురెల్ అవుట్ అయినట్టే పంత్ కూడా వెనుదిరిగాడు. హార్మర్ బౌలింగ్ లో దూసుకొచ్చిన బంతికి బ్యాట్ అడ్డు పెట్టాడు. ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన బంతి నేరుగా మార్క్ రమ్ చేతుల్లో వాలింది. దీంతో 58 పరుగుల వద్ద అయిదో వికెట్ కోల్పోయింది భారత్. ప్రస్తుతం టాప్ ఆర్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా క్రీజ్ లో ఉన్నారు. ఆచితూచి ఆడుతున్నారు.












Click it and Unblock the Notifications