IPL 2024: 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో ఆసీస్ స్టార్ పేసర్ రీఎంట్రీ-అసలు కారణమిదే ?
ఈ ఏడాది స్వల్ప విరామంలో జరగబోతున్న ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ టోర్నీలు క్రికెట్ అభిమానులకు పొట్టి క్రికెట్ మజాను ఆస్వాదించేందుకు ఎన్నడూ లేనంత మజాను అందించబోతున్నాయి. సుదీర్ఘంగా సాగే ఈ రెండు టోర్నీల తర్వాత అంతర్జాతీయంగా కూడా టీ20 క్రికెట్ కు ఆదరణ అమాంతం పెరగబోతోందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లు కూడా వీటిని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఆస్ట్రేలియా జట్టులో కీలక క్రికెటర్లలో ఒకడైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఈ మధ్య భీకర ఫామ్ లో కనిపిస్తున్నాడు. తాజాగా వన్డే వరల్డ్ కప్ టైటిల్ ను ఆస్ట్రేలియా గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఐపీఎల్ కు వచ్చే సరికి దూరంగా ఉండిపోతున్న మిచెల్ స్టార్క్ ఈసారి మాత్రం ఈ మెగా టోర్నీలో ఆడేందుకు సై అన్నాడు. అంతే కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి మరీ స్టార్క్ ను సొంతం చేసుకుంది.

అయితే తొమ్మిదేళ్ల విరామం తర్వాత మిచెల్ స్టార్క్ ఈసారి ఐపీఎల్ లో ఎందుకు రీఎంట్రీ ఇస్తున్నాడనే ప్రశ్న క్రికెట్ అభిమానులందరిలోనూ మెదులుతోంది. అప్పుడెప్పుడో 2014, 15 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మాత్రమే ఆడిన మిచెల్ స్టార్క్ అప్పటి నుంచి ఐపీఎల్ కు దూరంగా ఉంటున్నాడు. దీనికి కారణం టెస్ట్ క్రికెట్ కూ, తన కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యమే. కానీ ఈసారి మాత్రం ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ఈసారి ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున మిచెల్ స్టార్స్ బరిలోకి దిగడం వెనుక అసలు కారణం టీ20 వరల్డ్ కప్. ఈసారి అమెరికా, కరేబియన్ దీవుల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో సత్తా చాటుకోవాలని భావిస్తున్న ఈ ఆసీస్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కు అందుకు సన్నాహకంగా ఐపీఎల్ 2024 ఉపయోగపడబోతోంది. అందుకే ఇన్నేళ్లు దూరంగా ఉన్న ఐపీఎల్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ టోర్నీని ప్రాక్టీస్ కు వాడుకోవడం ద్వారా టీ20 వరల్డ్ కప్ లో ఇరగదీయాలనేది స్టార్క్ ఆలోచన.












Click it and Unblock the Notifications