షాకింగ్.. ఆనందం తట్టుకోలేక RCB వీరాభిమాని మృతి
ఐపీఎల్- 2025 టైటిల్ కైవసం చేసుకుంది ఆర్సీబీ. 18 ఏళ్ల నుంచి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ ఎట్టకేలకు జూన్ 3న రాత్రి పండగ చేసుకున్నారు. 18 ఏళ్ల నిరీక్షణ ఫలించి ఆర్సీబీ తొలిసారి కప్పు కొట్టిన వేళ అటు ఫ్రాంచైజీ, జట్టు సభ్యులు, ఇటు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ ఆనందం శృతిమించి కొంత మంది ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది.
18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు కొడితే.. దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. మరి బెంగళూరులోనైతే చెప్పాల్సిన పనిలేదు. అక్కడి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే బ్రాండ్ అంబాసిడర్ గా ఆర్సీబీ జట్టును ప్రోత్సహించడం సరికొత్త పరిణామంగా భావించవచ్చు. అయితే ఆర్సీబీ టైటిల్ సాధించిందన్న ఆనందంలో డ్యాన్స్ చేస్తూ ఓ అభిమాణి మృతి చెందడం కలకలం రేపుతోంది.
కర్ణాటక బెళగావి జిల్లా ముడల్గి ప్రాంతానికి చెందిన మంజునాథ్(25) అనే యువకుడు ఆర్సీబీ జట్టుకు వీరాభిమాని. ఆర్సీబీ గెలిచిందని డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు అతడ్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మంజునాథ్ మృతిచెందినట్లు ధ్రువీకరించారు. యువకుడి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంజునాథ్ కు భార్యతో పాటు ఆరు నెలల చిన్నారి ఉన్నట్లు సమాచారం. ఆయన భార్య సైతం మరోసారి గర్భం దాల్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన RCB విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అభిమానులు వేల సంఖ్యలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద గుమిగూడారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిమానుల రద్దీని నియంత్రించడంలో లోపాలు తలెత్తడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన పై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. మృతుల సంఖ్యను అప్పుడే అంచనా వేయడం కష్టమని పేర్కొంది.












Click it and Unblock the Notifications