హీరోల రోడ్ షోలకు బ్రేక్?
చిరంజీవి వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలలో ఇప్పటి వరకు 11 మంది తొక్కిసలాటల్లో మరణించారు. ఉత్తర తెలంగాణలో మాత్రం ఎవరూ మరణించలేదు. ఉత్తరాంధ్రలో అయిదుగురు మరణించగా, ఇటీవల రాయలసీమలో చిరు చేసిన రోడ్ షోలలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్ షోల రూటు మ్యాపులను ముందస్తుగా పోలీసులకు చిరంజీవి పార్టీ అందించడం లేదన్న అభియోగం ఉంది.
చిరంజీవి వందల సంఖ్యలో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకున్నప్పటికీ వారు ఎంత వరకు చిరంజీవి భద్రతను చూస్తున్నారు కానీ పబ్లిక్ భద్రత మీద దృష్టి సారించడం లేదు. పట్టణాల్లో ఇరుకు రోడ్ల మీదుగా చిరంజీవి వాహనంలో వస్తున్నప్పుడు జనం కిక్కిరిసిపోవడం వల్ల, తోసుకోవడం వల్ల ఊపిరాడక ఈ 11 మంది మరణించారు.
చిరంజీవి కాన్వాయ్ లో దాదాపు 60 నుంచి 70 వాహనాలు ఉంటున్నాయి. పర్యటన సాగిన గ్రామాల్లో ఎక్కువగా సింగిల్ రోడ్లు ఉండడం, కాన్వాయ్ లోని వాహనాలు రెండు మూడు వరుసల్లో రావడంతో అభిమానులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిరంజీవిని వారు దగ్గర నుంచి చూడాలంటే రథం ముందు ఉండాల్సిందే. రథం ముందు ఈ విధంగా తొక్కిసలాటలు జరగడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. ఈ విషయం ప్రజారాజ్యం వ్యూహకర్తల దృష్టికి వచ్చింది. రథం డిజైన్ లో స్వల్ప మార్పులు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది.
త్వరలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు కూడా రోడ్ షోలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఆ సందర్భంలో కూడా సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయి. అమాయకుల ప్రాణాలు ఇలా అనంత వాయువుల్లో కలిసి పోవడంతో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చిరంజీవి రోడ్ షోలలో సామాన్యులు ప్రాణాలు కోల్పోవడంపై కడప జిల్లాకు చెందిన ఒక స్వచ్చంద సంస్ధ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనించవలసిన విషయం.