రామోజీపైకి ప్రభాకరాస్త్రం?

ఇప్పుడు ప్రభాకర్ "సాక్షి" టీవీ చానల్ లో చేరడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో రామోజీరావు కుమారుడు సుమన్ "సాక్షి" దినపత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడం, తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. మొద్దు శీనును ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుందో, ఇప్పుడు ప్రభాకర్ ను కూడా అలాగే వాడుకుంటున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు రావచ్చు. కానీ అవి ఈ స్ధాయికి వచ్చేలా చేస్తున్నదెవరు? వాటిని రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నదెవరు? మీడియా మొఘల్ అయిన రామోజీరావును కన్న కొడుకు చేతనే విలన్ గా చెప్పించిన ఘనత ఎవరిది? ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా మారాడా? తనకు తాను మహాకవిగా భావించుకునే సుమన్ వద్ద ఇప్పటికిప్పుడు సొంత డబ్బు లేదు. తాను డబ్బు మనిషిని కానని, సరస్వతీ పుత్రుడినని ఆయన "సాక్షి" ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. తండ్రి ఆస్ధిలో సగభాగం పొందడానికి అర్హత ఉన్న ఆయనకు దాదాపు వెయ్యి కోట్ల ఆస్ధి రావచ్చు. సుమన్ సొంత చానల్ పెట్టుకుంటే ఆయనతో కలిసి పనిచేస్తానని ప్రభాకర్ చెబుతున్నాడు.
ప్రభాకర్ టీవీ 9 పిలిచిన వెంటనే నేడు ఇంటర్వ్యూ ఇవ్వడం ఒక విశేషం. అందులో ప్రభాకర్ కొత్త సంగతులు ఏమీ చెప్పనప్పటికీ అతను తన కళ్ళ భాషను బయటపడనివ్వకుండా నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. మొద్దు శీనుకు, ఇతనికి మధ్య ఎన్నో సారూప్యతలు కనిపిస్తున్నాయి. క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ ఇప్పుడు దాదాపు కోలుకున్న సుమన్ కు మానసిక స్ధితితో పాటు శారీరక స్ధితి కూడా బాగుండకపోవచ్చు. కానీ తండ్రీ కొడుకుల మధ్య చిచ్చు పెట్టడంలో ప్రభాకర్ చాలా కీలక పాత్ర వహించాడు. ఇప్పుడు ప్రభాకర్ ను వాడుకోడానికి అధికార పార్టీ చేసిన ప్రయత్నం సూపర్ హిట్ అయింది. రామోజీరావును పెద్ద విలన్ గా చిత్రీకరించడం వారి ధ్యేయం. కానీ జనం అమాయకులు కారు. ఎవరి వెనుక ఎవరున్నారన్న విషయాలను వారు సునిశితంగా గమనిస్తుంటారు.
కుటుంబ విషయాలను రచ్చకు ఈడ్చడం మీడియాకు నైతికం కాదు. కానీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పుడు ఇటువంటివి హైలైట్ అవుతూ ఉంటాయి. త్వరలో చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆర్ధిక లావాదేవీల మీద కూడా వార్తా కథనాలు రానున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications