స్పీడ్ పెరిగిన ప్రజారాజ్యం

శ్రీకాకుళం జిల్లాలో మొదటిరోజు చిరంజీవి తడబడినా రెండో రోజు నుంచి ఆయన ప్రసంగాలు పదునుతేలాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఇప్పుడు ఆయన బాగానే విమర్శించగలుగుతున్నారు. దానికి ప్రజల నుంచి స్పందన చెప్పుకోదగిన విధంగానే ఉంది. చిరంజీవి ఉత్తరాంధ్ర యాత్ర విజయవంతం కావడం దేనికి సంకేతం? అక్కడ బలంగా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ రెండు పార్టీలకు ప్రజారాజ్యం పెను ముప్పు తీసుకురాబోతోందన్న సంకేతాలు ఉన్నాయి. ఇదే పరిస్ధితి రాష్ట్రమంతటా ఉన్నా ఆశ్చర్యం లేదు. తెలుగుదేశం, టీఅర్ ఎస్ కలిస్తే తెలంగాణలో ప్రజారాజ్యం పార్టీ అంతగా బలపడకపోవచ్చు.
చిరంజీవి పార్టీ ప్రభావం పై అధికార కాంగ్రెస్ మేధావుల మధనం ప్రారంభమైంది. చిరు ప్రభంజనాన్ని లైట్ గా తీసుకోడానికి వీల్లేదని కొందరు వైఎస్ కు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిరంజీవి పార్టీనికి ఇంకా లైట్ గానే తీసుకుంటున్నారు. ఆయన చేతిలో ఏదో తురుపు ముక్క ఉందన్న అభిప్రాయం కలుగక మానదు. అయితే చిరంజీవికి సంబంధించిన రహస్య డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్ద ఉంటే ఉండవచ్చు. కానీ చిరంజీవి రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత వాటిని లీక్ చేసినా జనంలో విశ్వసనీయత ఉండదు.
అభిమానుల బలాన్ని ఓట్లుగా మలుచుకునే దిశగా చిరంజీవి శిబిరంలో వ్యూహ రచన జరుగుతోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకర్గాల వారీగా కమిటీలు సిద్ధమవుతున్నాయి. రాజకీయ అనుభవం ఉన్నవారిని, బూత్ ల మేనేజ్ మెంట్ లో నిష్ణాతులైన వారిని ప్రజారాజ్యం పార్టీ తీసుకోబోతోంది. జనం మధ్య ఎండల్లో తిరగడం వల్ల చిరంజీవి మొహం నల్లబడినా, జన సముద్రాలను చూసి ఆయన హృదయం విశాలమైనట్టు కన్పిస్తోంది. చివరికి ఏం జరుగుతుందో రాజకీయ తెరమీద చూడాలి.












Click it and Unblock the Notifications