'చేప' చెప్పిన కోటి కథ
"ప్రజారాజ్యం"తో సూర్యనారాయణ సంబంధాల మీద ఆగ్రహంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అతడిని ఎసిబికి పట్టించిందన్న విమర్శలు వస్తున్నాయి. తీగలాగితే డొంక కదిలినట్టు సూర్యనారాయణ వ్యవహారంలో ప్రజారాజ్యం పార్టీ కూడా ఇరుక్కుంది. ముగ్గురు ఐఎఎస్ అధికారులు చక్కగా దొరికిపోయారు. ఒక భారీ అవినీతి ఇంజినీరును పెంచి పోషించిన నిందను గత తెలుగుదేశం ప్రభుత్వం మీద వేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నాలుగున్నరేళ్ళలో సూర్యనారాయణ అక్రమాలు చాలా తక్కువని అతనితోనే చెప్పించడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
సూర్యనారాయణ అల్లు అరవింద్ సామాజిక వర్గానికి చెందిన వాడు. ప్రజారాజ్యం "ప్రధాన' నాయకుడికి వరుసకు సోదరుడైన చోదిశెట్టి సత్యనారాయణ ద్వారానే సూర్యనారాయణ తన కాంట్రాక్టులను చేయించేవాడు. మొత్తం 50 మంది కాంట్రాక్టర్లు ఉన్నా వారందరికీ ఇంచార్జి సత్యనారాయణే. సత్యనారాయణ ద్వారానే ప్రజారాజ్యం ప్రధాన నాయకుడికి కోటి రూపాయల ఫండ్ ను తన భార్య టికెట్ కోసం ఇచ్చినట్టు సూర్యనారాయణ ఎసిబి ఇంటరాగేషన్ లో అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రజారాజ్యం టికెట్ రంధి వల్లనే సూర్యనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వ ఆగ్రహానికి గురైనట్టు కొందరు అధికారులు అంటున్నారు.
పార్టీ ఫండ్ విషయం తెలియని చిరంజీవి నిన్న సూర్యనారాయయణను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెలిగిపారేశారు. తీరా విషయం తెలుసుకున్న తర్వాత ఏమి చేయాలో పాలుపోని పరిస్ధితి ఆయనకు దాపురించింది. ఇదొక్క విషయంలోనే గాక చిరంజీవిని అనేక రకాలుగాఇరికించే ప్రయత్నాలను అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తోందని విమర్శలు వస్తున్నాయి.