సమరం వెనుక సారధి!
చిరంజీవికి, మోహన్ బాబుకు మధ్య ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు గత కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ ఉత్సవాల సందర్భంగా ఆ వేదిక మీద మోహన్ బాబు చిరంజీవి లెజెండా, సెలబ్రిటీనా అని ప్రశ్నించడం వివాదానికి దారి తీసింది. దానిపై ఆనాడు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు.
గురువు దాసరి నారాయణరావు కనుసైగ చేయకుండా మోహన్ బాబు చిరంజీవిపై కామెంట్స్ చేయడానికి సాహసించరని తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్లు అందరికీ తెలుసు. కాపు కులానికి చెందిన దాసరి నారాయణరావు ఆ కులం బలంతోనే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు కాగలిగారు. కొంతకాలం కేంద్ర సహాయ మంత్రిగా పనిచేయగలిగారు. తన కులం నుంచి వచ్చి సొంతపార్టీ పెట్టుకున్న చిరంజీవి వల్ల తాను రాజకీయంగా వీక్ అవుతానన్న భావన మొదటి నుంచి దాసరికి ఉంది. అయితే చిరంజీవి పార్టీ విజయం కాకపోవడం దాసరి వర్గానికి ఆనందం కలిగించి ఉంటుంది.
ఇప్పుడు చిరంజీవి మీద విమర్శలు చేసి, ఆయన చర్యలను ప్రజలు క్షమించరని మోహన్ బాబుతో చెప్పించడం ద్వారా దాసరి చిరంజీవి మీద మరో చిరు విజయం సాధించారు. సినిమా వాళ్ళు, కాపు కులస్ధులు చిరంజీవి వెనుక పెద్దగా లేరన్న సంకేతాన్ని మోహన్ బాబు ద్వారా దాసరి కాంగ్రెస్ అధిష్టానానికి, సామాన్య జనానికి ఇవ్వగలిగారు.
నిశితంగా పరిశీలిస్తే ఈ వివాదం ఇంతటితో సమసిపోయేలా లేదు. అన్నయ్య మీద ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే ఒంటికాలి మీద లేచి విమర్శించే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. పవన్ నిర్వేదానికి కారణాలు తెలియవలసి ఉంది.
నేను ఏమన్నానో, నువ్వు ఏమన్నావో తేల్చుకుని క్షమాపణలు చెప్పుకోవడానికి పబ్లిక్ లోకి రా అని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చిరంజీవికి సవాల్ విసిరారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను ఎవరినైనా అనదలుచుకుంటే నేరుగా అంటానని, డొంక తిరుగుడుగా మాట్లాడే అలవాటు తనకు లేదని, అంతటి పిరికిపందను కానని ఆయన అన్నారు.
చిరంజీవి సాఫ్ట్ కాబట్టి ఈ వ్యాఖ్యల మీద సాఫ్ట్ గానే స్పందిస్తారు. పవన్ కల్యాణ్ అయితే పచ్చి మిర్చిలాగా ఘాటుగా స్పందించేవారు. ఆయన రేపైనా కనీసం పత్రికా ప్రకటన ద్వారా అయినా స్పందిస్తారని చిరు-పవన్ అభిమానులు ఆశతో ఉన్నారు.