వైఎస్ పంట పండింది!

వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సామాన్య ప్రజల్లో వ్యతిరేకత లేదన్న వాస్తవం ఎన్నికల ఫలితాల్లో బయటపడింది. వైఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు మంచి ఫలితాలనే తెచ్చిపెట్టాయి. పావలాకే మహిళలకు రుణాలు, ఆరోగ్యశ్రీ, వృద్ధాప్యపు పెన్షన్లు, రైతులకు ఉచిత విద్యుత్ తదితర పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఒక రకంగా వైఎస్ పంటపండినట్టే. ఇంతటి పోటీలో ఆయన ఒంటిచేత్తో కాంగ్రెస్ ను విజయతీరాలకు నడిపించారంటే, జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకమే ప్రధాన కారణం. చంద్రబాబు నాయుడు నగదు బదిలీ, ఉచిత కలర్ టీవీల స్కీంలు పెద్దగా పనిచేసినట్టు కన్పించడం లేదు.
వరుసగా ఐదేళ్ళు రుతుపవనాలు బాగా ఉండడం, సరిపడినన్ని వర్షాలు పడడం వైఎస్ కు కలిసొచ్చిన అంశం. చివరి సంవత్సరంలో వర్షాలు సరిగా పడకపోయి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడి ఉండేది. వైఎస్ మొదటి నుంచి వరుణ దేవుడిని నమ్ముకున్నారు. వాన దేవుడు తమ కేబినెట్ లో ఉన్నారని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు.
మరోసారి వైఎస్ ముఖ్యమంత్రి కానున్నట్టు కన్పిస్తోంది. తెలంగాణ విషయంలో తాను తీసుకున్న వైఖరి మంచిదేనని ఆయన ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు కాలరు ఎగరేసి చెప్పుగల పరిస్ధితి వచ్చింది. వైఎస్ స్ధానంలో బీసీ ముఖ్యమంత్రి అన్న ప్రచారం కూడా ఈ ఫలితాలతో ఎగిరిపోయింది.












Click it and Unblock the Notifications