చంద్రబాబుకు చీలిక ముప్పు?

వైయస్ జగన్ పార్టీ నుంచి విడిపోయి ప్రత్యేకంగా కొత్త పార్టీ పెడతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే కాకుండా తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి కాంగ్రెసు నాయకత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం శాసనసభ్యులకు ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయల దాకా కాంగ్రెసు ఇవ్వజూపుతుందని బహిరంగంగానే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం నాయకులే ఆ ప్రకటన చేశారు. తమ పార్టీ శాసనసభ్యులను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెసు ప్రయత్నిస్తోందని వారు విమర్శించారు.
కేంద్ర మంత్రి బంధువు ఒకరు ప్రతి రోజూ తమ పార్టీ శాసనసభ్యులకు ఫోన్లు చేస్తూ బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టాలని సూచిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ 30 మంది ఎవరనేది స్పష్టంగానే తెలిసిపోతోంది. తెలంగాణకు చెందిన శాసనసభ్యులకు ఆ వ్యక్తి ఫోన్ చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బయటకు వచ్చినప్పుడు ఏ విధమైన విమర్శలు రావని కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట. ఒకవేళ పార్టీ ఫిరాయింపుల నిరోధం కింద అనర్హత వేటు పడినా నష్టం లేదని, తెలంగాణ కోసం బయటకు వచ్చినందున ప్రజలే తిరిగి గెలిపించుకుంటారని వివరిస్తున్నారని సమాచారం. ఎన్నికల ఖర్చు కూడా తామే పెట్టుకుంటామని కేంద్ర మంత్రి బంధువు చెబుతున్నారని సమాచారం.
అయితే, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లి కొత్త పార్టీ పెట్టినవారెవరూ ఫలితం సాధించలేదని తెలుగుదేశం వర్గాలు దీమాతో ఉన్నాయి. వసంత నాగేశ్వర రావు, కె. జానారెడ్డి, పి. ఇంద్రారెడ్డి, దేవేందర్ గౌడ్ పార్టీ నుంచి విడిపోయి కొత్త పార్టీలు పెట్టారని, అలా పెట్టి తేలిపోయారని అంటున్నారు.












Click it and Unblock the Notifications