తెలంగాణ నేతకు కీ పోస్టు

మంత్రి విస్తరణతో పాటు పిసిసి అధ్యక్షుడి నియామకం పెండింగులో ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఆ పదవిలో కొనసాగడానికి సుముఖంగా లేరని అంటున్నారు. ఆయన కేంద్రంలో ఓ పదవిని అడుగుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్పులు దండిగానే ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా రోశయ్యను మార్చి తెలంగాణ నేతకు ఆ పదవిని కట్టబెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆ పదవి కోసం గీతా రెడ్డి, జానా రెడ్డి, ఎస్ జైపాల్ రెడ్డి కూడా పోటీ పడుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అందుకు కేశవరావు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే కేశవరావును ఢిల్లీకి పిలిపించి ఉంటారని కూడా అంటున్నారు. అయితే, రోశయ్యను మార్చడానికి సోనియా గాంధీ సిద్ధంగా లేరనే మాట కూడా గట్టిగానే వినిపిస్తోంది.
తెలంగాణకు చెందిన నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వవచ్చునని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆ పదవిని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన కేశవరావును నియమించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఇంతకు ముందు ఆ పదవిని నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. పైగా, ఈ మధ్య కాలంలో ఆయన అధిష్టానానికి చాలా విశ్వాసపాత్రుడిగా మారారు. చెప్పిన పని చెప్పినట్లు చేసుకుని వస్తారని ఆయనపై అధిష్టానానికి నమ్మకం ఉంది. అయితే, జాతీయ స్థాయిలో ఇప్పటికే కేశవరావు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల రాష్ట్రానికి కేశవరావును పరిమితం చేస్తారా అనేది కూడా అనుమానమే. కానీ ఆయన తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెసులో నాయకత్వం వహిస్తున్నారు. ఇది ముందు చూపుతోనే అధిష్టానం సూచన మేరకే ఆయన నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అందువల్ల ప్రస్తుత తరుణంలోనే కేశవరావుకు రాష్ట్రంలో కీలక బాధ్యత అప్పగిస్తారని అంటున్నారు.
కోస్తాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పురంధేశ్వరిని గానీ మరొకరికి గానీ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా ఉంది. అలా అప్పగించాల్సి వస్తే ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు తెలంగాణ నేతకు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం సాగుతున్న ఊహాగానాలు. కొద్ది రోజుల్లో గానీ అసలు స్వరూపమేమిటో తెలియదు.












Click it and Unblock the Notifications