వైయస్ జగన్ ముందస్తు దూకుడు

ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం వైయస్ జగన్ కు లేదని ఆయన వర్గానికి చెందిన నాయకులు పదే పదే చెబుతున్నారు. అయితే, ఈ మాటలను నమ్మాల్సిన అవసరం లేదు. తన తండ్రి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని తాను నడిపించేందుకు కూడా ఆయన పథకాలు రచించి, అమలు చేయవచ్చు. సాధ్యమైనంత ఎక్కువ మంది శాసనసభ్యులను తన వైపు తిప్పుకునే తన ప్రయత్నాలను ఆయన విరమించుకోలేదనే చెప్పాలి. 2014 లోపలే ఆయన అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవసరమైనంత మేర దూకుడుగా వ్యవహరించవచ్చు. ప్రజారాజ్యం, తెలుగుదేశం శాసనసభ్యులను కూడా ఆయన తన వైపు తిప్పుకునేందుకు వెనకాడకపోవచ్చు. ఇప్పటికే, కొంత మంది ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు జగన్ కు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ లోపల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం స్థిరంగా నడవకుండా ఎప్పటికప్పుడు తిప్పలు పెట్టడం నిరంతరం ఆయన సాగించే కార్యక్రమం. డిసెంబర్ 31వ తేదీ తర్వాత, అంటే శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పెద్ద సవాల్ నే ఎదుర్కోవాల్సి ఉంటుందనేది అందరి అంచనా. ఆ సవాల్ ను ఎదుర్కునే క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి కావచ్చు కూడా. ఈ స్థితిలో తన పాచికలను వేయాలని కూడా వైయస్ జగన్ అనుకుంటూ ఉండవచ్చు. తెలంగాణ, సీమాంధ్ర శాసనసభ్యులు తిరిగి రెండుగా చీలిపోయే రాజకీయ వాతావరణం ఏర్పడవచ్చునని భావిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సిఫార్సులు ఏ విధంగా ఉన్నా అది తప్పదని అనుకుంటున్నారు. దీన్ని సమర్థంగా వాడుకుని తాను లాభపడే ఉద్దేశంతో వైయస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు లభించే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. పైగా తానే అస్థిరపరిచే కార్యక్రమాలకు దిగుతారు.












Click it and Unblock the Notifications