జగన్ వెంట అప్పుడు 150 మంది, ఇప్పుడు 19
ఈ ఏడాది ఆగస్టులో జగన్ వర్గానికి చెందిన 26 మంది శానససభ్యులు రాజీనామాలు చేశారు. అప్పుడు ఆయన వెంట మొత్తం 29 మంది శానససభ్యులున్నారు. వారిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి, ఒకర ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కాగా, 26 మంది కాంగ్రెసు సభ్యులు. వారిలో తెలుగుదేశం పార్టీకి చెందిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. కాంగ్రెసు సభ్యులు దాదాపు పది మంది వెనక్కి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ శానససభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన నేపథ్యంలో జగన్ వెంట విజయమ్మతో కలిపి 19 మంది శాసనసభ్యులు మిగిలారు.
అంత మంది తన వైపు నిలబడినందుకు తనకు గర్వంగా ఉందని జగన్ అన్నారు. గతంలో తన దయాదాక్షిణ్యాల మీదనే ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. కానీ, అది జరగలేదు. అయితే, ఆరు నెలల క్రితం తెలుగుదేశం అవిశ్వాసం ప్రతిపాదించి ఉంటే ప్రభుత్వం పడిపోయి ఉండేదని తెలుగుదేశం అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు - జగన్పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తన వర్గం శానససభ్యులను పది మందిని జగన్ కాంగ్రెసు వైపు పంపించారని, గతంలో ప్రభుత్వాన్ని కూలుస్తానని జగన్ ప్రగల్భాలు పలికారని అన్నారు.