బాబును బాలయ్య గట్టెక్కిస్తారా?
బాలకృష్ణ క్రియాశీలక పాత్ర పోషించడం వల్ల నందమూరి కుటుంబం నుంచి చంద్రబాబుకు ముప్పు తప్పుతుంది. పార్టీపై పట్టు కోసం ప్రయత్నిస్తూ, నారా లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లను అడ్డుకోవడానికి, వారి ప్రయత్నాలను తిప్పికొ్ట్టడానికి బాలకృష్ణ పనికి వస్తారు. అసలు బాలకృష్ణ ప్రవేశమే చంద్రబాబు వ్యూహంలో భాగంగా జరుగుతుందనే ప్రచారం ముమ్మరంగా ఉంది. ఆ ప్రచారంలో నిజం లేకపోలేదు కూడా. బాలకృష్ణను అడ్డం పెట్టుకుని నారా లోకేష్కు లైన్ క్లియర్ చేయాలనేది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు.
అయితే, బాలకృష్ణ పార్టీని గట్టెక్కించగలరా అనేది సందేహమే. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరిస్తారనేది కలలో మాటే. అందువల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీని తిరిగి బలోపేతం చేయడం ఆయన వల్ల అయ్యే పని కాదు. సీమాంధ్రలో కొంత మేరకు బాలయ్య ప్రభావం ఉండవచ్చు. కానీ, కాంగ్రెసులోని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను, చిరంజీవిని తట్టుకుని పార్టీని ముందుకు తీసుకుని పోవడం ఆయనకు అంత సులభం కాదు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సీమాంధ్రలో అత్యంత బలంగా ఉన్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. వైయస్ జగన్ జైలుకు వెళ్తారని, కాంగ్రెసుకూ తమకూ మధ్యనే పోటీ ఉంటుందని చంద్రబాబు నమ్ముతున్నట్లున్నారు. ఈ స్థితిలో బాలకృష్ణ ఇమేజ్ పార్టీకి ఉపయోగపడవచ్చుననేది అంచనా. అయితే, వైయస్ జగన్ పార్టీ ఏ విధమైన ప్రణాళికను సిద్దం చేసిందనేది పూర్తిగా తెలియడం లేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడం కూడా బాలకృష్ణకు సాధ్యమవుతుందనేది చెప్పలేం. మొత్తం మీద, బాలకృష్ణ పార్టీని గట్టెక్కించడమనేది అంత సులభంగా కనిపించడం లేదు.