చిరుకు బొత్స చెక్ పెడతారా!

చిరంజీవి తనకు పోటీగా భావించనని తాను ఆ స్థాయికి ఎదిగితే తనకు సహకరిస్తానని బొత్స బుధవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. కాపు - బిసి సమన్వయ సాధన కార్డుతో పిసిసి చీఫ్ పదవి సాధించిన బొత్స, మళ్లీ అదే కార్డుతో ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ మేరకు తన లక్ష్యసాధనకు చేరువయ్యేందుకు సత్తిబాబు ఎక్కడా దాచుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. అధిష్ఠానం ఆయనకు దన్నుగా నిలవడంతోపాటు, కేంద్రంలో మంత్రిపదవి కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వైయస్ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి చిరంజీవి మాత్రమే జనాకర్షణగల నేత. ఈ నేపథ్యంలో చిరు ప్రాధాన్యాన్ని గ్రహించిన బొత్స తాను ప్రత్యామ్నాయంగా బరిలో ఉండాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించిన బొత్స చిరంజీవికి ఉన్న కాపు ఆయుధాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బిసి కాపు - కాపులను సమన్వయం చేసుకునే బాధ్యతను స్వీకరిస్తానన్న హామీతో పిసిసి పీఠం పొందిన బొత్స ఇప్పుడు అసలు కాపులను కూడా చిరు కోణంలో దగ్గర చేసుకునే వ్యూహానికి తెరలేపారు. చిరంజీవి కంటే కాపుల్లో తనకే ఎక్కువ ఇమేజ్ ఉందన్న విషయాన్ని పార్టీ నాయకత్వానికి పంపడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
అందులో భాగంగా పలు జిల్లాల్లోని కాపు - బలిజ నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. చిరంజీవికి కాపులలో ఎక్కువ ఇమేజ్ ఉండటంతో పాటు, సాధారణ జనంలో కూడా ఆయనకున్న ఇమేజ్ - గ్లామర్తో పోలిస్తే బొత్స సహజంగానే చిన్న గీత అవుతారంటున్నారు. చిరంజీవి భవితవ్యం కూడా కాపు-బీసీలను సమన్వయం చేసుకునే అంశంపైనే ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన బీసీ వెలమతో బొత్స సంబంధాలు ఎలా నెరపుతారన్నది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే బొత్స తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పుడు బీసీ వెలమలు ఆయనను వ్యతిరేకించారు. చివరకు ఆవర్గం వారితో రాజీకి వచ్చారు. ఫలితంగా ఆయన అత్యల్ప మెజారిటీతో బయటపడ్డారు. బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా సహా శ్రీకాకుళం, విశాఖ జిల్లాలోని తూర్పు కాపులతో బీసీ వెలమలకు దశాబ్దాల నుంచి వైరం ఉన్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ విజయానికి వారి సహకారం అవసరం తప్పనిసరి. ఉత్తరాంధ్రలో మెజారిటీ జనాభా ఉన్న బీసీ వెలమకు చెందిన నాయకులు బొత్స వెంట లేకపోవడం ఆయన లక్ష్యసాధనకు ప్రధాన అవరోధమని చెబుతున్నారు. చిరంజీవికి కాపుల్లో ఇమేజ్, జనంలో గ్లామర్ ఉన్నప్పటికీ బొత్స స్థాయిలో మాటకారితనం చొరవ లేదంటున్నారు. రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు అసలే తెలియవని చెబుతున్నారు. పైగా ఆయన ఇప్పటివరకూ కాపుజన నేతగానే ముద్రపడ్డారు తప్ప, బీసీ-కాపులను సమన్వయం చేసుకునే నేతగా ఇంకా తెరపైకి రాలేదు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో పెద్ద బిసి కులాలను ఎలా సమన్వయం చేసుకుంటారో కూడా తెలియని పరిస్థితి ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications