మాస్టర్ మైండ్ భాను: పక్కా ప్లాన్తో సూరి హత్య

భానును లేపేస్తానని సూరి అనేకమార్లు అందరి ముందు అన్నాడని, దీంతో తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం సూరిని చంపాలని 2010 డిసెంబర్లోనే నిర్ణయించుకున్నాడని సిఐడి విచారణలో భాను వెల్లడించారట. ఆపై భాను ఒక నాటు తుపాకీ కొని దాంతో కొన్నాళ్లు ప్రాక్టీస్ చేశాడు. అది సరిగా పేలకపోవడంతో దానిని నమ్ముకుంటే పని జరగదనే నిర్ణయానికి వచ్చాడు. గన్మన్ మన్మోహన్ సింగ్కు చెందిన రివాల్వర్ను తీసుకున్నాడు. దానితో సుమారు నెల రోజులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేశాడు.
గత ఏడాది జనవరి మూడో తేదీన సూరిని చంపడానికి స్కెచ్ వేశాడు. నలుగురు అనుచరులను రంగంలో దించి రెండు బైక్లు, ఒక కారును వివిధ ప్రాంతాల్లో ఉంచాడు. నవోదయ కాలనీలో సూరిని అతి సమీపం నుంచి కాల్చి చంపి తన అనుచరుడితో కలిసి మోటార్ బైక్పై తన ముఖం కన్పించకుండా హెల్మెట్ పెట్టుకుని వెళ్లాడు. ఆ తర్వాత కారులో షోలాపూర్ వెళ్లాడు. సంపాదించిన కోట్లాది రూపాయలను ఏం చేశావన్న సిఐడి ప్రశ్నలకు భాను ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆ డబ్బుకు పక్కా లెక్కలున్నాయని, అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పినట్లు సమాచారం.
సూరి హత్య తర్వాత ఎక్కడెక్కడ ఉన్నాడనే ప్రశ్నకు మాత్రం రకరకాల సమాధానాలు చెప్పి, అయోమయం సృష్టించినట్లు తెలిసింది. భానుకు శనివారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత మాసాబ్ ట్యాంక్లోని సిఐడి కార్యాలయానికి తరలించారు. రాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఆయనకు న్యాయమూర్తి మే 4వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
కాగా కోట్ల విలువైన సెటిల్మెంట్లు చేసి కోట్ల కొద్దీ ఆస్తులు సంపాదించుకున్న భాను కిరణ్ కేవలం నాలుగు లక్షల రూపాయలతో 15 నెలలు గడిపాడట. సూరి హత్య అనంతరం నెలల తరబడి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి దేశమంతా తిరిగి, కేవలం డబ్బుకోసం రాష్ట్రానికి వస్తూ దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇన్ని నెలలు భాను కేవలం రూ.4 లక్షలతోనే గడిపాడట. ఇక భాను లొంగుబాటు వెనుక ప్రముఖుల రాయబారం ఉందని అనుమానాలు వ్యక్తమవుతుండగా, పోలీసులు దానిని ఖండిస్తున్నారు.












Click it and Unblock the Notifications