ఇలా ఐతే ఇబ్బందే!: కిరణ్ స్పీడ్కు బ్రేక్
ప్రభుత్వ పథకాలపై సిఎం ఎవరితోనూ చర్చించడం లేదన్న నేతల ఫిర్యాదును ఆజాద్ తీవ్రంగానే పరిగణించారట. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయలేమిని నివారించకపోతే పార్టీకి భవిష్యత్ ఉండదన్న నిర్ణయానికి ఆయన వచ్చారట. అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్న తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య సమష్టితత్వాన్ని పెంచాల్సిన అవసరముందన్న నిర్ణయానికి ఆయనవచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతల మధ్య అగాధానికి కారణమవుతున్న సిఎం ఏకపక్ష నిర్ణయాలకు ఇక తెరదించాలని ఆజాద్ నిర్ణయించినట్లుగా సమాచారం. ఇకపై కొత్తగా ఏదైనా పథకాన్ని అమలు చేయాలన్నా.. ప్రస్తుత పథకాలను మార్చాలన్నా తప్పకుండా కోర్ కమిటీ సమావేశంలో చర్చించాలని ఆయన ఆదేశించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలపై సిఎం కఠినవైఖరి ప్రదర్శించక పోవడంపై కూడా చాలామంది నేతలు ఆగ్రహంతో ఉన్నారు. అన్ని విషయాల్లో సమన్వయ కమిటీ నేతల భాగస్వామ్యం ఉంచే ఉద్దేశ్యంలో భాగంగా నెలకోసారి భేటీ ఉంటుందని కూడా ఆజాద్ స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ సిఎంకు పూర్తి అధికారం ఇచ్చిన అధిష్టానం ఇక నుండి 2014 ఎన్నికలే లక్ష్యంగా అందరికీ సమ ప్రాధాన్యత ఇస్తూ సిఎంను కట్టడి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.