జూ ఎన్టీఆర్, హరికృష్ణ: బాబుకు మహానాడు భయం
ఢిల్లీలో బాబుపై పరోక్ష విమర్శలు చేసిన హరికృష్ణ, ఆ తర్వాత కార్యాలయంలో బైఠాయించారు. రెండు రోజుల క్రితం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరయ్యారు. అప్పటికే బాబుపై గుస్సాగా ఉన్న హరికృష్ణ ఇటీవల జూనియర్ దమ్ము సినిమా విడుదల రోజే టిడిపి కృష్ణా జిల్లాలో బంద్కు పిలుపునివ్వడం ఆయన కోపానికి మరింత కారణం అంటున్నారు. అందుకే ఆయన పోలిట్ బ్యూరో సమావేశానికి రాలేదంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ మోహన్ కలయిక వెనుక జూనియర్ ఎన్టీఆర్ హస్తం ఉందనే వాదనలు వచ్చాయి. అంతేకాకుండా లోకేష్ కుమార్, బాలకృష్ణపై జూనియర్ ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో మహానాడు జరిగితే బాబుకు తలనొప్పులు వస్తాయంటున్నారు.
మహానాడుకు వారు వస్తారా రారా, వస్తే ఏం మాట్లాడుతారో అనే ఆందోళనలో టిడిపి నేతలు ఉన్నారని అంటున్నారు. వారు రాకుంటే పార్టీతో కలిసి రారనే ప్రచారం జరుగుతుందని, వస్తే ఏ బాంబు పేలుస్తారో అనే చర్చ జరుగుతోందట. గత మహానాడులో జూనియర్ పాల్గొనలేదు. హరికృష్ణ పాల్గొన్నప్పటికీ సభలో మాట్లాడలేదు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడమని కోరినప్పటికీ హరికృష్ణ తోసిపుచ్చారు. దీంతో ఇప్పుడేం జరుగుతుందో అని టిడిపి నేతలు మదనపడుతున్నారట. హరికృష్ణకు అసలే ఆవేశం ఎక్కువ పాళ్లని, ఆయన ఏకంగా పార్టీ వేదిక పైనే అధినాయకత్వాన్ని ప్రశ్నించినా ప్రశ్నించవచ్చునని అంటున్నారు. వారు కనుక వచ్చి చెప్పాలనుకున్నది చెబితే ఇబ్బందులే అంటున్నారు.
మహానాడు ఇప్పుడే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ త్వరలో జరగనున్న ఉప ఎన్నికల కారణంగా అది వాయిదా పడింది. ఉప ఎన్నికల తర్వాత తేదీలు ఖరారు చేస్తామని టిడిపి వర్గాలు చెప్పాయి. దీంతో మహానాడుకు మరింత సమయం దొరికిందని, అప్పటి వరకు నందమూరి - నారా కుటుంబాల మధ్య సఖ్యత తిరిగి చిగురించాలని టిడిపి నేతలు ఆశిస్తున్నారట.