జగన్ అరెస్టుపై కాంగ్రెసు ఆలోచన మారిందా?
జగన్ విషయంలో అధిష్టానం తన వైఖరి మార్చుకునే అవకాశాలున్నాయంటూ కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ నుంచే జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ప్రత్యర్థి పి. శంకరరావు అనడాన్ని కూడా ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. జగన్పై ప్రయోగించిన వ్యూహాలు ఎదురు తిరిగినట్లు కాంగ్రెసు వర్గాలంటున్నాయి. తాజాగా, ఆరుగురు మంత్రులకు, ఎనిమది మంది ఐఎఎస్ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం వైయస్ జగన్కు అనుకూలంగా మారినట్లు భావిస్తున్నారు. మంత్రులకు నోటీసులు జారీ అయిన విషయంపై తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాలు ఇప్పటికే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. వారి రాజీనామాకు పట్టుబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శాసనసభా కార్యక్రమాలను అడ్డుకుంటోంది.
ప్రస్తుత స్థితిలో జగన్ను సిబిఐ అరెస్టు చేస్తే మరింత సానుభూతి పెరిగే అవకాశం ఉందని, తమ పార్టీ నష్టపోవడం ఖాయమని కాంగ్రెసులోని ఓ వర్గం అంటోంది. వైయస్ జగన్ ఏప్రిల్ 2వ తేదీలోగా అరెస్టవుతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెసు వ్యూహం మారినట్లు కనిపిస్తోందని అంటున్నారు.