ఈ జైలుకొచ్చిన తొలి ఎంపి జగన్, 'గాలి' గదిలోనే

కాకతాళీయమే అయినా గాలి కోసం సమకూర్చిన సదుపాయాలు జగన్కూ ఉపయోగపడుతున్నాయని తెలుస్తోంది. జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన పలువురు అధికారులు, ఇతర వ్యక్తులు ప్రత్యేక నిందితుల హోదాలో పక్కనే ఉన్నారు. ఇదే కేసులో రెండో నిందితుడు విజయ సాయి రెడ్డి ఇటీవలి వరకు వీరితో పాటు ఉండేవారు. ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. కాగా అరెస్టయి చంచల్గూడ జైలుకు వచ్చిన తొలి ఎంపీ జగనే.
జైలులో వైయస్ జగన్ ప్రధానంగా చాయ్ మీదనే ఆధారపడుతున్నారట. జగన్ను సోమవారం సాయంత్రం జైలుకు తరలించారు. ఆయన ఆ రోజు రాత్రి పండ్లు, బ్రెడ్ తీసుకున్నారు. రాత్రి ఎనిమిదిన్నరకే పడుకొని, ఉదయం ఆరున్నరకు లేచారు. అనంతరం కాలకత్యాలు తీర్చుకొని టీ తాగారు. ఉదయం చపాతీలు, కోడిగుడ్డు కూరతో ఫలహారం చేశారు. పగలు కప్పుల మీద కప్పులు చాయ్ తాగారని తెలుస్తోంది. మధ్యాహ్న భోజనంలో పెరుగన్నం, రసం, మజ్జిగ, రాత్రి ఆలుగడ్డ కూరతో చపాతీలు తిన్నారు.
మళ్లీ చాయ్ తాగారు. జగన్ కోసం సోమవారం సాయంత్రం ఆయన సహాయకులు ఇంటి నుంచి భోజనం, పండ్లు, బిస్కట్లు, మంచినీళ్లు తెచ్చారు. అయితే జైలు అధికారులు భోజనాన్ని తిప్పి పంపించి, పండ్లు బిస్కట్లు మాత్రం ఆయనకు అందజేశారు. మంచినీటి బాటిల్స్ జైలు క్యాంటీన్లో అందుబాటులో ఉంటాయని చెప్పి తిప్పి పంపారని సమాచారం. మరోవైపు జగన్ గదిలో కూలర్ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.
జగన్ బ్యారక్కు ఒక జైలర్, డిప్యూటీ జైలర్, ఐదుగురు వార్డన్ల బృందంతో భద్రత కల్పిస్తున్నారు. కుటుంబ సభ్యులతో ములాఖత్కు కూడా జైలర్ స్థాయి అధికారి, మరికొందరు భద్రతా సిబ్బంది జగన్ను వెంటబెట్టుకొని డిప్యూటీ సూపరిండెంట్ గదికి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే జైలు పర్యవేక్షక సిబ్బందిని సైతం జగన్ బ్యారక్లోకి అనుమతించడం లేదని తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications