షర్మిల మెయిన్ రోల్, వైయస్ వివేకా సైడ్ రోల్
షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుడితే, పార్టీ ప్రధాన నాయకులు ఛోదకశక్తిగా పనిచేయడానికి సిద్ధపడ్డారు. షర్మిలకు అడుగడుగునా తగిన సూచనలు చేయడానికి ఓ యంత్రాంగం ఏర్పడినట్లు చెబుతున్నారు. ఆమె ప్రసంగాలకు మరింత పదును పెట్టేందుకు తగిన సూచనలు చేస్తున్నట్లు సమాచారం. అసమర్థ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అసమర్థ ప్రభుత్వాన్ని కాపాడుతున్న తీరును ఎండగట్టడానికి తాను పాదయాత్ర చేస్తున్నట్లు షర్మిల గురువారంనాటి బహిరంగ సభలో చెప్పారు.
షర్మిల పాదయాత్రకు వైయస్ వివేకానంద రెడ్డి పూర్తిగా మద్దతు ప్రకటించడమే కాకుండా ఆమె పాదయాత్ర కుట్రను ఛేదిస్తుందని అన్నారు. షర్మిల పాదయాత్ర విజయవంతమవుతుందని అన్నారు. కాగా, వైయస్ జగన్ భార్య భారతి గురువారం ఇడుపులపాయలో జరిగిన బహిరంగసభలో వైయస్ విజయమ్మ, షర్మిలలతో పాటు పాల్గొన్నారు. ఆమె కేసుల వ్యవహారాలు, సంస్థల వ్యవహారాలు చూసుకుంటారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో దానికి దీటుగా షర్మిల పాదయాత్రకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రీకారం చుట్టింది. వైయస్ జగన్ జైలులో ఉన్నా పార్టీని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకోవడానికే కాకుండా చంద్రబాబు వైపు పార్టీ నాయకులు వెళ్లకుండా చూడడానికి కూడా షర్మిల పాదయాత్ర పనికి వస్తుందని భావిస్తున్నారు.
షర్మిల ప్రజల మధ్యకు వెళ్లి వారితో మాట్లాడి, బహిరంగ సభల్లో ప్రసంగించడానికి మాత్రమే పరిమితవుతారు. పార్టీ వ్యవహారాలు చూసుకోవాల్సిన బరువు ఆమెపై లేదు. దీంతో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా తన లక్ష్యాన్ని నెరవేర్చడంపై ఆమె దృష్టి సారించే అవకాశాలున్నాయి. వ్యూహాలు పన్నడం, వాటిని ఆచరణలో పెట్టడం వంటి చర్యలను పార్టీ కోర్ గ్రూప్ చూసుకుంటుంది.