కూల్గా జూ.ఎన్టీఆర్: చర్చించాకే నాని జంప్?

నాని తీరుపై టిడిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాని వైయస్ జగన్కు రూ.30 కోట్లకు అమ్ముడు పోయారని టిడిపి కృష్ణా జిల్లా నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేతలు నానిపై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ వివరణ ఇచ్చుకునేందుకు బయటకు వచ్చిన జూనియర్ మాత్రం కూల్గానే కనిపించారు. నాని పార్టీ మార్పు వెనుక జూనియర్ హస్తం ఉందన్న వాదనలు ఖండించేందుకు ఆయన తన ఇంట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ సమావేశంలో ఆయన కూల్గా మాట్లాడారు. అంతేకాదు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి విలేకరులు పదే పదే అడిగినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదని అంటున్నారు. విలేకరులు అదే విషయమై ప్రశ్నిస్తుండటంతో తప్పదు కనుక ఆయన తనకు మావయ్యతో ఎలాంటి విభేదాలు లేవని మొక్కుబడిగా చెప్పారని అంటున్నారు. లోకేష్ గురించి ప్రస్తావించినప్పుడు కూడా యువత రాజకీయాలలోకి రావాలని చెప్పానే కానీ తాను వస్తానని చెప్పలేదన్నారు. నాని తనకు సన్నిహితుడే చెప్పిన జూనియర్ ఆయన పార్టీ మార్పును ఖండించక పోవడం గమనార్హం.
నాని పార్టీ మారడానికి గల కారణాలు తనకేం తెలుసునని, ఆయననే అడగాలని, ఆయనకు గల కారణాలు ఆయనకు ఉండవచ్చునని అన్నారు. అంటే జూనియర్ టిడిపిలో సమస్యలు ఉన్నాయని చెప్పకనే చెప్పారనే వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా పార్టీ మారడానికి ముందు కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాను పార్టీ మారాలనుకుంటున్నానని నాని చెప్పారని అంటున్నారు.
తనను కలిసిన నానితో జూనియర్... తాను మరో పదిహేనేళ్ల వరకు రాజకీయాలలోకి రానని, రాజకీయ భవిష్యత్తు విషయంలో నీ నిర్ణయం నీవు తీసుకోవచ్చునని సూచించారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తనకు పార్టీలో ప్రాధాన్యం లేదని భావించిన నాని.. జూనియర్ రాజకీయ ఆరంగేట్రం చేయకుంటే భవిష్యత్తులో తనకు మరింత ఇబ్బందులు ఎదురవుతాయని భావించే జగన్కు జై కొట్టారని అంటున్నారు. జగన్ వైపు వెళ్లేందుకు జూనియర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనప్పటికీ అడ్డుకోలేదని, ఆయన నిర్ణయాన్ని ఆయనకే వదిలేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications