రాహుల్ కోటరీ: పావులు కదుపుతున్న కెవిపి?
కొద్ది రోజులుగా కెవిపి రామచందర్ రావు ఢిల్లీ పార్టీ సీనియర్ నేతను కలిసి మాట్లాడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్న మర్రి శశిధర్ రెడ్డిని, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ను కలుసుకుని ఆయన మాట్లాడినట్లు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పుల అవకాశాలపై ఆయన మాట్లాడినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఏ మార్పులు జరిగినా తనకు సన్నిహితులైన వైయస్ రాజశేఖర రెడ్డి అనుయాయులకు ప్రాధాన్యం తగ్గకుండా చూసుకోవాలని కెవిపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో కెవిపికి సన్నిహితుడైన లోక్సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకుని మాట్లాడడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
సోనియా అపాయింట్మెంట్ కోసం ఉండవల్లి కొంతకాలంగా నిరీక్షిస్తున్నారని, గురువారానికి అపాయింట్మెంట్ దొరికిందని, దీంతో ఆయన రాష్ట్ర రాజకీయ మార్పుల గురిం చి సోనియాకు వివరించారు. రాష్ట్ర పరిస్థితుల గురించి వివరంగా మాట్లాడేందుకు మరింత సమయం కావాలని సోనియాను ఆయన కోరినట్లు తెలిసింది. సోనియాను కలిసి వచ్చిన తర్వాత కెవిపి, ఉండవల్లి కొద్ది సేపు మంతనాలు జరిపారు. లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులతో కూడా కెవిపి మాట్లాలడారు.
దిగ్విజయ్ సింగ్ను తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలుకుని మాట్లాడారు. వారి మధ్య జరిగిన చర్చల్లో కెవిపి ప్రస్తావన కూడా వచ్చినట్లు తెలిసింది. వైయస్ అనుయాయులందరూ పూర్తిగా పార్టీని విడిచిపెట్టి వెళ్లలేదని, వైయస్ అనుయాయులందరికీ ఆత్మవిశ్వాసం కలగాలంటే కెవిపిలాంటి వారి అవసరం పార్టీకి ఉందని దిగ్విజయ్కి కోమటిరెడ్డి వివరించినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద, కెవిపి మళ్లీ తెర మీదికి రావడానికి పెద్ద కసరత్తే చేస్తున్నట్లున్నారు. ఇటీవల ఆయన మంత్రి రఘువీరారెడ్డి చేపట్టిన భగీరథ యాత్రలో కూడా పాల్గొన్నారు.