అమెరికాలో దొరకని సాన్వీ అచూకీ, గాలింపు
తన కూతురుకు ఎలాంటి హాని చేయవద్దని సాన్వీ తండ్రి శివప్రసాద్ రెడ్డి కోరారు. ఎవరికైనా లభిస్తే పాపను తమకు అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అప్పర్ మెరియాన్ టౌన్షిప్లో ఉన్న 200 అపార్టమెంట్ల సముదాయంలో ఎఫ్బిఐతో పాటు అబింటన్ పోలీసులు గాలింపు చేపట్టారు. గత సోమవారం సత్యవతిని దుండగులు హత్య చేసి, సాన్వీని ఎత్తుకుపోయారు.
సాన్వీ ఆచూకీని కనిపెట్టి, తల్లిదండ్రులకు అప్పగించడానికి తమ వద్ద ఉన్న వనరులను అన్నింటినీ వాడుతున్నామని మోంట్గోమెరీ కౌంటీ జిల్లా అటోర్నీ రిసా వెట్రి ఫెర్మన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సాన్వీ తండ్రి వెంకట కొండా శివ వెన్నా, తల్లి చెంచు లత పునూరు 2007 ఫిబ్రవరిలో అమెరికాకు వచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన వీరి వద్దకు శివ తల్లి సత్యవతి జులైలో వచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో ఆమె తిరిగి ఇండియాకు వెళ్లాల్సి ఉంది. సత్యవతి మృతికి తానా సంతాపం ప్రకటించింది.
కొడుకు, కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో సాన్వీని సత్యవతి చూసుకుంటున్నారు. కొందరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బాలికను కిడ్నాప్ చేయబోగా సత్యవతి వారిని అడ్డుకున్నారు. దీంతో వారు ఆమెను హత్యచేసి చిన్నారిని కిడ్నాప్ చేశారు. దీనిపై ఆమె కుమారుడు ప్రసాద్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవతి మరణవార్త తెలిసి కుడుములకుంట్ల గ్రామంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.