జగన్తో సాయి ప్రతాప్ అండర్స్టాండింగ్!
కడప, పులివెందులలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు జిల్లాకు చెందిన మిగిలిన నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తే.. సాయి ప్రతాప్ మాత్రం మిన్నకుండిపోయారు. వైయస్ను అభిమానించే వ్యక్తిగా ఆయన జగన్ను విమర్శించ లేకపోయారట. అందుకే ఆయన ప్రచారంలో కీలకంగా వ్యవహరించలేదు. పార్టీ నేతలు జగన్ అవినీతిని ప్రశ్నిస్తున్నా, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శిస్తున్నా అంతేస్థాయిలో ఎదురుదాడి చేశారు.
కానీ అప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న సాయి ప్రతాప్ మాత్రం జగన్ను విమర్శించేందుకు సాహసించలేదు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే ఆయనకు కేంద్రమంత్రి పదవి వచ్చిందనే వాదనలు ఉన్నాయి. జిల్లాకు చెందిన డిఎల్ రవీంద్రా రెడ్డి తదితర నేతలు జగన్ పైన ధ్వజమెత్తినా సాయి ప్రతాప్ మాత్రం ఒక్కసారి కూడా ఆయనను విమర్శించిన దాఖలాలు లేవు. దీనంతటికీ వైయస్ సాన్నిహిత్యం, జగన్తో ఉన్న అండర్స్టాండింగే కారణమని అంటున్నారు.
అంతేకాదు ఇటీవల ఆయన రాష్ట్ర రాజకీయాలకు దాదాపు దూరంగా ఉన్నారు. కొన్ని నెలలుగా ఆయన తన వ్యాపారాల పైన మాత్రమే దృష్టి సారిస్తున్నారట. జిల్లాలో కాంగ్రెసు పార్టీ బలోపేతానికి కానీ, పార్టీ నేతగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు గానీ ఆయన దూరంగా ఉంటున్నారట. దీనికంతటికీ కారణం.. ఇప్పటికి ఆయన మౌనంగా ఉన్నప్పటీకీ 2014 ఎన్నికల్లో మాత్రం జగన్ పార్టీ అభ్యర్థిగానే బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.
జగన్ పార్టీలో చేరేందుకు ఆయన మానసికంగా అందరికంటే ముందే సిద్దమైపోయారని, కాంగ్రెసులో ఏదో అలా అలా కొనసాగుతున్నారని అంటున్నారు. అయితే పలువురు తమ తమ పదవులకు రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరుతుండగా.. ఆయన పట్ల అపార అభిమానం ఉన్న సాయి ప్రతాప్ మాత్రం తన పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరక పోవడానికి కారణమేమిటో అంతుచిక్కడం లేదట. వచ్చే ఎన్నికల సమయంలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారో అస్సలు అర్థం కావడం లేదట. ఇది కూడా అండర్ స్టాండింగ్లో భాగమా అనే ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు.