చిరు రాజీనామాను ఎందుకు నోటిఫై చేయలేదు?

ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో చిరంజీవి రాజీనామాను నోటిఫై చేయకపోవడం వెనక ఏదైనా మతలబు ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై శాసనసభ సచివాలయ వర్గాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలనే విషయాన్ని తమకు ఇప్పటి వరకు ఎందుకు అందజేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రెండు సార్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని 17 శాసనసభ స్థానాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే సమయంలో తిరుపతి స్థానానికి జరగకూడదనే ఉద్దేశంతోనే చిరంజీవి రాజీనామాను నోటిఫై చేయడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 17 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే సమయంలో అయితేనే తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక జరపడం సులభం అవుతుందని, తిరుపతి స్థానానికి విడిగా ఉప ఎన్నిక నిర్వహించడం కష్టమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం అంటూ త్వరగా శాసనసభ సచివాలయం చిరంజీవి రాజీనామాను నోటిఫై చేసేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సూచించింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 17 మంది శానససభ్యులపై అనర్హత వేటు పడిన విషయాన్ని తెలియజేయడంలో కూడా తీవ్ర జాప్యం చేసిన విషయం అనుభవంలో ఉన్నదే. ఎన్నికల సంఘం రెండు సార్లు ఆరా తీసిన తర్వాతనే శాసనసభ సచివాలయం ఆ వివరాలను ఎన్నికల సంఘానికి పంపించింది. రాజీనామాను స్పీకర్ ఆమోదించిన తర్వాత వెంటనే ఆ సమాచారాన్ని శాసనసభా సచివాలయం ఎన్నికల సంఘానికి అందించాల్సి ఉంటుంది. కానీ, ఈ విషయంలో గతంలో 17 స్థానాల విషయంలో చేసినట్లుగానే చిరంజీవి రాజీనామా విషయంలోనూ జాప్యం చేస్తోంది.












Click it and Unblock the Notifications