లోకేష్ వర్సెస్ జగన్: అప్పుడు వైయస్, బాబు
హైదరాబాద్: తరాలు మారుతాయి గానీ రాజకీయ పరిణామాలు పునరావృతమవుతాయని రాష్ట్ర రాజకీయ చరిత్రను చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడు, రాష్ట్ర రాజకీయాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి మధ్య సమరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలి దాకా తెర వెనక ఉండిపోయిన లోకేష్ క్రమంగా క్రియాశీలకంగా మారుతున్నారు. తాజాగా, ఆయన వైయస్సార్ కాంగ్రెసు నాయకులపై, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్పై ట్విట్టర్లో ఘాటైనా వ్యాఖ్యలు చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు దాదాపుగా ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. కాస్తా వెనకా ముందులు ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు. పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఇద్దరు రాష్ట్ర రాజకీయాల్లో సమఉజ్జీలుగా కొనసాగారు. వైరమైనా, స్నేహమైనా ఒకే రకంగా చేశారు. ఇప్పుడు వారి తనయులు రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. తమ తమ పార్టీలను అధికారంలోకి తెచ్చుకోవడానికి తీవ్రంగా తాపత్రయపడుతున్నారు.
తండ్రి మరణించిన తర్వాత వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీ నుంచి సొంత పార్టీని స్థాపించుకున్నారు. పార్టీని ఆయన ఒంటి చేతి మీద నడిపించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే సిబిఐ కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు. ఇప్పుడు ఆయన జైలు నుంచి రాజకీయ మంత్రాంగం నడుపుతున్నారు. కాబోయే ముఖ్యమంత్రిగా జేజేలు కొట్టించుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరులో కాస్తా వెనక్కి తగ్గిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇటీవలి కాలంలో చురుకుదనం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఆయన ప్రజల్లోకి ఎలా వెళ్లాలో పార్టీ నాయకులకే కాకుండా తండ్రికి కూడా సూచనలు చేస్తున్నారు. ఇటీవలి చంద్రబాబు వ్యాఖ్యలన్నీ లోకేష్ తయారు చేసినవేనని అంటున్నారు.
వైయస్ జగన్ తండ్రి అధికారంలో ఉండగానే క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. కడప లోకసభ స్థానం నుంచి పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున కొన్ని స్థానాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. రాజకీయ ప్రాబల్యానికి అండగా మీడియాను స్థాపించుకున్నారు. దేశంలోనే అతి సంపన్నుడైన రాజకీయవేత్తగా పేరు సంపాదించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. వైయస్ జీవించి ఉన్నప్పుడే తనకు అత్యంత విధేయులతో ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
నారా లోకేష్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడుతూ అందరితో కలిసి పోవడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కుమారుడిగా ఆయన చుట్టూ ఓ అధికార ప్రాబల్యం చోటు చేసుకుంది. ఆయన మాటకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తిరుగులేదని అంటున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైయస్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇరువురి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో సాగుతూ ఉండేది. ఒకరిపై ఒకరు పాత చరిత్రలను తవ్వుకుని దుమ్మెత్తిపోసుకున్న సందర్భాలున్నాయి.
వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రం ధోవతీ, చొక్కా ధరించి రైతు జీవిగా కనిపించేవారు. పాదయాత్రలో ధోవతి పైకి మడిచి కట్టి, తలకు రుమాలు చుట్టుకుని అచ్చం రైతులాగా కనిపించారు. ఆయన వస్త్రధారణ, హావభానాలు, చేయి ఊపడం ఓ ట్రేడ్ మార్క్. 2004 ఎన్నికలకు ముందు వైయస్ చేపట్టిన పాదయాత్ర ఓ సంచలనం.
చంద్రబాబు కార్పోరేట్ కల్చర్కు ప్రతినిధిగా కనిపిస్తారు. రెండు వేళ్లను పైకెత్తి విజయ సంకేతంతో అభివాదం చేయడం ఆయన ట్రేడ్ మార్కుగా ఉంటూ వచ్చింది. అలాగే, ప్యాంట్, చొక్కా ధరించి, ఆధునికుడిగా లాగా కనిపిస్తున్నారు. ఆధునికులకు ఆయన ప్రతినిధిగా కనిపిస్తారు. ఒకటి రెండు సార్లు ఆయన లుంగీలో వేదికల మీదికి వచ్చిన సందర్భాలున్నాయి. ఇప్పుడు మాత్రం రుమాలు చుడుతున్నారు. రెండు వేళ్లతో విజయ సంకేతంతో అభివాదం చేయడాన్ని మానుకుని దండం పెడుతూ పాదయాత్ర చేస్తున్నారు.
వైయస్, చంద్రబాబు- ఇద్దరూ దాదాపుగా ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఇరువురు కూడా కాంగ్రెసు పార్టీతోనే తమ రాజకీయాలను ప్రారంభించారు. పార్టీలో కూడా పోటాపోటీగా ఎదుగుతూ వచ్చారు. కాంగ్రెసు పార్టీలో ఉండగానే చంద్రబాబు మంత్రిగా పనిచేశారు. అప్పుడు అంతా తెలుపు, నలుపేనా..