ఫొటోలు: పవన్ కళ్యాణ్ను బొత్స లాక్కొస్తారా?
హైదరాబాద్: వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెసు తరఫున ప్రచారానికి చిరంజీవి కుటుంబ సభ్యులంతా దిగుతారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అందరి దృష్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఉంది. చిరంజీవి కేంద్ర మంత్రిగా కాంగ్రెసు విజయానికి ప్రచార సారథ్యం వహించే అవకాశాలున్నాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రజారాజ్యం పార్టీని గెలిపించడానికి విస్తృతంగా పర్యటించిన పవన్ కళ్యాణ్కు ప్రజల్లో ఆకర్షణ అమితంగానే ఉంది.
పవన్ కళ్యాణ్ ఇమేజ్ను కాంగ్రెసు వాడుకోవడానికి ప్రయత్నాలు సాగించవచ్చుననే మాట వినిపిస్తోంది. ఈ విషయంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన వంతు కృషి చేస్తారని అంటున్నారు. నిర్మాత బండ్ల గణేష్తో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకుని పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపేందుకు ఆయన ప్రయత్నించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో నిర్మాత బండ్ల గణేష్తో ఉన్న సాన్నిహిత్యంతో బొత్స సత్యనారాయణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను కాంగ్రెసు తరఫున ప్రచారంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.
అన్నయ్య చిరంజీవికి అండగా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచార బరిలోకి దిగుతారా, లేదా అనేది ఆసక్తికరమైన విషయమే.
అన్యయ్య చిరంజీవికి అండగా నాగబాబు ఉడుతా భక్తిగా కాంగ్రెసు పార్టీ కోసం వచ్చే ఎన్నికల్లో పని చేసే అవకాశాలున్నాయి. నాగబాబుకు రాజకీయ ఆసక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ తేజ్ రాజకీయాలకు దూరంగా ఉంటారా, తండ్రి మెగాస్టార్ చిరంజీవికి అండగా కొంత మేరకైనా ముందుడుగు వేస్తారా...
అల్లు అర్జున్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు చిరంజీవి కోసం వస్తారా అనేది సందేహమే..
చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ తన వంతు బాధ్యతగా కాంగ్రెసు కోసం ఏ చేయి వేయవచ్చు. ఆయనకు కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది.
బండ్ల గణేష్ కాంగ్రెసు తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఏదో మేరకు కాంగ్రెసుకు పనికి వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలోకి దిగుతారా, లేదా అనేది వేచి చూడాల్సిందే. నాగబాబు మాత్రం తన సోదరుడు చిరంజీవికి అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగానే ఉన్నారు. రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ వంటి చిరంజీవి కుటుంబ సభ్యులు ప్రచారంలోకి దిగుతారనేది అనుమానంగానే ఉంది.
అయితే, చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెసు అధిష్టనం ప్రకటిస్తే మాత్రం ఆయన కుటుంబ సభ్యులంతా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. కానీ, కాంగ్రెసు అధిష్టానం ఆ సాహసం చేయకపోవచ్చునని అంటున్నారు. అలా చేస్తే, పార్టీలో సహాయ నిరాకరణ ప్రారంభమయ్యే ప్రమాదం ఉంది. పార్టీ గెలిచిన తర్వాతనే ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చే సంప్రదాయం కాంగ్రెసు పార్టీలో ఉంది. చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మొదటికే మోసం రావచ్చునని అంటున్నారు. ఏమైనా, చిరంజీవి కుటుంబ సభ్యుల ఇమేజ్ కాంగ్రెసు పార్టీకి ఏ మేరకు పనికి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.