64వ పడిలో బాబు: 200 రోజుల యాత్ర
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం ఏప్రిల్ 20వ తేదీతో 64 పడిలో పడ్డారు. ఆయనను అభినందించడానికి తనయుడు నారా లోకేష్ విశాఖపట్నం జిల్లాకు చేరుకున్నారు. కాగా, ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై పైశాచిక చర్య జరిగన నేపథ్యంలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆయన పాదయాత్ర 200 రోజులకు చేరుకుంది.
చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నాటికి 200 రోజులు పూర్తి చేసుకుంది. అక్టోబర్ రెండో తేదీన అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సుమారు ఏడు నెలల నుంచి ఇంటి ముఖం చూడకుండా, ప్రజల మధ్యే గడుపుతున్నారు. దసరా, దీపావళి, న్యూ ఇయర్, భోగి, సంక్రాంతి, ఉగాది, తదితర పండుగలన్నీ ప్రజలతోనే జరుపుకొంటున్నారు.

చంద్రబాబు ఇప్పటికి సుమారు 2,750 కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా, కాళ్ళ నొప్పులు తీవ్రమైనా, పాదయాత్ర ఆపేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదు. ఈ మధ్య కాలంలో డాక్టర్లు హెచ్చరిస్తే, విశాఖ జిల్లాలో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన ఈ నియోజకవర్గంలో ఎనిమిది రోజులు బస చేశారు. బాబు ఇప్పటి వరకూ జరిపిన పాదయాత్రలో ఎక్కడా ఇన్ని రోజులు గడపలేదు.
ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రతి రోజు ఒకటి, రెండు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఆయన బస చేస్తున్న బస్సులో రోజుకు, ఒకటి రెండు నియోజకవర్గ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో టిడిపి పరిస్థితి ఏమిటి? ప్రత్యర్థులు ముఖ్యంగా కాంగ్రెస్, వైకాపాల పరిస్థితి ఏవిధంగా ఉందన్న సమాచారాన్ని కూడా తన వద్ద ఉంచుకున్నట్టు తెలిసింది. నాయకుల ముందుంచి, వచ్చే ఎన్నికల్లో ఏవిధంగా ఎదుర్కోవాలో తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
గత ఎన్నికల్లో కాంగ్రెస్కు, టిడిపి మధ్య పోరు జరుగుతుందని అనుకుంటే, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వచ్చి టిడిపి అవకాశాలను దెబ్బతీసింది. ఇప్పుడు వైయస్ జగన్ వైయస్ కాంగ్రెసు పార్టీ ఇదే పాత్ర పోషించనుందన్న సమాచారం టిడిపి నాయకుల వద్ద ఉంది. అందుకే వైయస్సార్ కాంగ్రెసు బలాబలాలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications