కిరణ్ ఎదుర్కోలేరనేనా?: మార్చాకే తెలంగాణ!
తెలంగాణ సమస్యపై కేంద్రం, కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీవ్ర తర్జన భర్జన పడుతోంది. నెల అంటే నెలలోనే కాదని, పదిరోజులు అటు ఇటు కావొచ్చునని ఆజాద్ చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే నిజంగా మరికొద్ది రోజుల్లో తేల్చుతారా లేక ఎప్పటిలాగే అలాగే నాన్చుతారా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. తెలంగాణపై కాంగ్రెసు ఎంతోకాలంగా పిల్లిమొగ్గలు వేస్తేంది. షిండే వ్యాఖ్యలు ఈసారి తేల్చినట్లుగానే కనిపించాయి. కానీ ఆఖరున ఆజాద్ ప్రకటన నీరుగార్చింది.
అయితే ఈ వాయిదా తాత్కాలికమా? దీర్ఘకాలికమా? అనే చర్చ సాగుతోంది. తెలంగాణపై ఎలాంటి ప్రకటన చేసినా అనూహ్య పరిణామాలు తలెత్తి, కిరణ్ సర్కార్ పడిపోయి, రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఏర్పడుతుందన్న సీమాంధ్ర నేతల హెచ్చరికల నేపథ్యంలోనే నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆజాద్ తెలంగాణ నేతలకు పరోక్షంగా చెప్పినట్లు సమాచారం.
2009 డిసెంబర్ 9న తెలంగాణపై ప్రకటన తర్వాత తలెత్తిన పరిణామాలు పునరావృతం కాకూడదని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ హెచ్చరించారట. వారం రోజులుగా సీమాంధ్ర నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీలో మకాం వేశారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు స్వయంగా రంగంలోకి దిగి, నేతలను రప్పించి నిర్ణయం తీసుకుంటే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు.
మరోవైపు తెలంగాణ నేతలు కూడా ఢిల్లీలో దిగారు. దీంతో ఢిల్లీలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. బుధవారం సాయంత్రం కాంగ్రెసు పెద్దలు సోనియాని కలుసుకుని దాదాపు 45 నిమిషాల పాటు సమాలోచనలు జరిపారు. ప్రస్తుతానికి నేతలందరినీ ఢిల్లీ నుంచి పంపించేయాలని ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాత మళ్లీ నిర్ణయంపై దృష్టి పెట్టాలని వారు భావించినట్లుగా తెలుస్తోంది.
నిజంగానే కిరణ్ సర్కార్కు గండం ఏర్పడుతుందా? అదే జరిగితే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? సామదానభేద దండోపాయాలను ఎవరిపై, ఏ విధంగా ప్రయోగించాలి? ఇరు ప్రాంతాల నేతలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం ఏమిటి? రాష్ట్రంలో రాజకీయ మార్పులు చేసిన తర్వాతే నిర్ణయం ప్రకటించాలా? అన్న విషయాలపై వారు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. భేటీ ముగిసిన తర్వాత ఆజాద్ మీడియాకు ముందుకు వచ్చి నిర్ణయం వాయిదా గురించి ప్రకటించారు.
తెలంగాణపై నిర్ణయం వాయిదా వెనుక నేతలు పలు కారణాలు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించినా, లేక తెలంగాణకు ప్యాకేజీతో సరిపెట్టినా... ఆపై తలెత్తే పరిణామాలను అదుపు చేయగల పరిస్థితిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేరని, అందువల్ల ముందు నాయకత్వ మార్పు తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రానున్న బడ్జెట్ సమావేశాలు కాంగ్రెస్కు అగ్నిపరీక్ష లాంటివి. బడ్జెట్ను గట్టెక్కించుకోవడం చాలా అవసరం. అటూ ఇటూ అయితే కేంద్ర సర్కారుకే గండం వచ్చి పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుని, మరొకరికి ఆగ్రహం తెప్పించి ఆపద కొని తెచ్చుకోవడం ఎందుకనే ప్రశ్న తలెత్తినట్లు సమాచారం. బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు కొన్నివర్గాలు చెబుతున్నాయి. అయితే, బడ్జెట్తో దీనికి సంబంధం లేదని, బడ్జెట్కంటే ముందే తెలంగాణపై నిర్ణయం వస్తుందని కొందరు స్పష్టం చేస్తున్నారు.
సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల నేతలు ఢిల్లీకి వచ్చి తీవ్రమైన ఒత్తిడి తెస్తుండటంతో, అధిష్ఠానం తాత్కాలిక ఉపశమనం కోసం నిర్ణయాన్ని వాయిదా వేసిందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇక, నెల రోజుల గడువు అంటూ షిండే చేసిన ప్రకటనకు కాంగ్రెస్ ఆమోదం లేదని, అందువల్లే తన పని తాను చేసుకుపోతుందని కూడా కొందరు చెబుతున్నారు.