తెలంగాణకు వైయస్ జగన్ను అడ్డేస్తున్న కెవిపి?

రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకునే ఉద్దేశంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం ముందుకు వచ్చిన నేపథ్యంలో కెవిపి రామచందర్ రావు చురుగ్గా పావులు కదిపారు. సీమాంధ్ర నాయకులను వెంట పెట్టుకుని అధిష్టానం పెద్దల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలోనే ఆజాద్ ప్రకటన వెలువడింది. తెలంగాణకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కెవిపి అడ్డు వేయడం వల్లనే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ విషయంలో పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. అందుకే, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కెవిపిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
తాను జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయిస్తానని, అది సాధ్యం కాకపోతే ఎన్నికల్లో పొత్తుకు ఒప్పిస్తానని కెవిపి రామచందర్ రావు అధిష్టానానికి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. జగన్ తిరిగి కాంగ్రెసులోకి వస్తే సీమాంధ్రలో ఇక పార్టీకి తిరుగు ఉండదని, అప్పుడు తెలంగాణలో కొన్ని సీట్లు వచ్చినా కాంగ్రెస్కు సరిపోతుందని ఆయన కాంగ్రెసు అధిష్టానం పెద్దలకు రాతపూర్వకంగా తెలియజేసినట్లు చెబుతున్నారు. జగన్ను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, ఆ విషయంలో తనను విశ్వసించాలని ఆయన వారిని కోరినట్లు చెబుతున్నారు.
తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో జగన్ విజయం సాధిస్తారని, తెలంగాణలో కనీసం 20 సీట్లు సాధిస్తారని దాని వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన వివరించినట్లు సమాచారం. అందువల్ల తెలంగాణ ఇవ్వకుండా రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని, అప్పుడు జగన్ కూడా షరతులకు అంగీకరిస్తారని అధిష్ఠానానికి నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది. తాను జగన్తో సన్నిహితంగా వ్యవహరించే వారితో మాట్లాడుతున్నానని, తెలంగాణ ఇస్తే చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయేందుకు జగన్ అంగీకరించరని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచినట్టయితే జగన్ తమ షరతులకు అంగీకరిస్తారని జగన్ సన్నితులు తనతో అంటున్నారని ఆయన వివరించారని సమాచారం. అవసరమైతే ఈ విషయంలో జగన్ కుటుంబసభ్యులకు నచ్చ చెబుతానని భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ అంశాన్ని తేల్చేయాలనే పట్టుదలతోనే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్నారు. అయితే, కెవిపి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పొత్తుల విషయంపై జైపూర్ చింతన్ శిబిర్లో కాంగ్రెసు తీసుకున్న నిర్ణయం మాత్రం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. వయలార్ రవి రాష్ట్రంలో జగన్ పార్టీతో పొత్తుపై అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్య కూడా ఆసక్తికలిగిస్తోంది. ‘జగన్తో పొత్తుపై మా రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకుంటుంది. పొత్తులకు మేం వ్యతిరేకం కాదు, జగన్తో పొత్తు ఆలోచిస్తున్నాం' అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అయితే, జగన్తో ఏ విధమైన సంబంధాలను కూడా వి. హనుమంతరావు వంటి తెలంగాణ కాంగ్రెసు నేతలు ఇష్టపడడం లేదు. తెలంగాణలో పార్టీ పోయినా ఫరవాలేదు, సీమాంధ్రలో జగన్ ద్వారా నెట్టుకొద్దామనే సాహసానకి కాంగ్రెసు అధిష్టం సిద్ధమైతే పరిస్థితి మొత్తం తారుమారు కావడం ఖాయం.












Click it and Unblock the Notifications