ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించరా?

మీడియా ప్రతినిధులకు వచ్చే నెలలో జరిగే స్టాండింగ్ కమిటీల అవగాహన సదస్సు సమాచారం తెలిపిన అనంతరం వారితో స్పీకర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఎమ్మెల్యేల రాజీనామాల విషయంపై ఒక ప్రతినిధి ప్రశ్నించినప్పుడు దానిపై స్పందించేందుకు నిరాకరించారు. పైగా సుస్థిర ప్రభుత్వం ఉండాలన్నదే అందరి కోరిక అని వ్యాఖ్యానించారు. దాన్ని బట్టి రాజీనామాలను ఆమోదించేందుకు ఆయన సిద్ధంగా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం స్పీకర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు రాజీనామా లేఖలు పెండింగ్లో ఉన్నాయి. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్ళ నాని, సుజయకృష్ణ రంగారావు స్పీకర్ ఫార్మట్లో రాజీనామా లేఖలను సమర్పించి చాలాకాలమైంది. పద్ధతి ప్రకారం అయితే రాజీనామా లేఖలు తన వద్దకు వచ్చినప్పుడు స్పీకర్ సదరు ఎమ్మెల్యేలను పిలిపించి వారితో మాట్లాడాల్సి ఉంటుంది. ఈసారి ఆ పని కూడా జరగలేదు. కనీసం వారికి సమయం కూడా కేటాయించలేదు. దీన్ని బట్టి వారి రాజీనామాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ భావించటం లేదని అనుకుంటున్నారు.
ఒకవేళ వీరి రాజీనామాలను ఆమోదిస్తే వెనువెంటనే పార్టీలో ఉంటూ జగన్ వర్గానికి మద్దతు పలుకుతున్న కనీసం ఏడు లేదా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. రాజీనామాలు ఆమోదించాలా వద్దా అనేది స్పీకర్ విచక్షణాధికారమే అయినా ముందుగా మూడు రాజీనామాలు ఆమోదించి తర్వాత వచ్చేవాటిని ఆపేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఏడు లేదా ఎనిమిది మంది రాజీనామాలనూ ఆమోదించాల్సి వస్తే ప్రభుత్వ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యాన్ని ఊహించినందుకే స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెబుతున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ ఒడిదుడుకులు ఉండరాదనే ఉద్దేశంతోనే స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన మనసులోని అభిప్రాయాన్ని ఒకసారి స్పష్టంగా బయటపెడితే మళ్లీ మళ్లీ రాజీనామాలంటూ ఎవరూ రారన్న ఆలోచనతోనే స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications