చెప్పేదొకటి చేసేదొకటి!: కేజ్రీవాల్ 'బిజినెస్ క్లాస్' దుమారం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజినెస్ క్లాస్ ప్రయాణం వివాదాస్పదమైంది. ప్రపంచ బ్రాండ్ సమ్మిట్ ఈ ఏడాది అత్యంత ప్రభావిత వ్యక్తిగా కేజ్రీవాల్ను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఆయనను సన్మానించేందుకు బ్రాండ్ సమ్మిట్ సంస్థ ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన గురువారం నాడు దుబాయ్ వెళ్లారు.
కేజ్రీవాల్ తన బిజినెస్ క్లాస్ సీటులో ఉన్న సమయలో ఓ ప్రయాణికుడు కలసి ఫోటో తీసుకున్నాడు. వెంటనే దాన్ని ట్విట్టర్లో పెట్టాడు. ఇది తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఆయన పైన మండిపడ్డాయి. ఆమ్ ఆద్మీ కోసం అంటూ బిజినెస్ క్లాస్లో ప్రయాణించడమేమిటని ప్రశ్నించాయి. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్ద కార్లను ఉపయోగించలేదు. అంతేకాదు, పెద్దపెద్ద ప్రభుత్వ బంగళాలు తీసుకోలేదు.
ఇప్పుడు మాత్రం బిజినెస్ క్లాస్లో ప్రయాణించడం వివాదాస్పదమైంది. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖురానా మాట్లాడుతూ... ఈ విషయం ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రకాల వైఖరికి అద్దం పడుతోందని, వారి ఎన్నికల ప్రచారం కోసం ఓ చేత్తో ప్రజలను విరాళాలు అడుగుతూ మరో చేత్తో బిజినెస్ క్లాస్లో ప్రయాణాలు చేస్తున్నారని, ఎకానమీ క్లాస్లోనే వెళ్లాలని కేజ్రీవాల్కు తాము చెప్పినా తిరస్కరించారని, పొదుపు చర్యలు పాటించాలని చెబుతూనే, కేజ్రీవాల్ ఇలా ప్రయాణం చేయడం సరైంది కాదన్నారు.
దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ వివరణ ఇచ్చింది. నిర్వాహకులు స్పాన్సర్ చేశారని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదానీ గ్రూపుకు చెందిన ప్రయివేట్ జెట్లో వెళ్లినప్పుడు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేజ్రీవాల్ విరాళాల కోసం దుబాయ్ వెళ్లడం లేదన్నారు. శనివారం వరకు ఆయన దుబాయ్లో ఉంటారని తెలిపింది. అక్కడి నుండి ఆయన న్యూయార్క్ వెళ్తారని తెలిపింది. ఈ పర్యటనకు మొత్తం నిర్వాహకులు స్పాన్సర్ చేశారని తెలిపారు.
ఇదిలా ఉండగా, కేజ్రీవాల్ అమెరికా వర్సిటీ కొలంబియా విద్యార్థులను ఉద్దేశించి ఆదివారం ప్రసంగించనున్నారు. వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ విద్యార్థులనుద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించనున్నారని షికాగోలో పార్టీ వాలంటీర్ మునీష్ రైజాదా వెల్లడించారు. అమెరికా, బ్రిటన్లలో ఏఏఫీకి భారీ సంఖ్యలో మద్దతుదారులున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా పార్టీ మద్దతుదారులతోనూ కేజ్రీవాల్ సమావేశమవుతారు.