మే 1 నుంచి భారీ మార్పులు.. గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీలో కొత్త రూల్స్ ఇవే..!!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హార్మూజ్ జలసంధి మూతపడిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలకు ముడి చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. భారత్ లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మే 1 నుంచి గ్యాస్ బుకింగ్, డెలివరీలో భారీ మార్పులు రాబోతున్నాయి. గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీలో ఈ మార్పుల కారణంగా సామాన్య ప్రజలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇకపై గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలంటే తప్పనిసరిగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చే OTP ని డెలివరీ బాయ్ కు చెప్పాల్సి ఉంటుంది. అలా చెబితేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది. దీనిని డెలివరీ అథెంటికేషన్ కోడ్ అని పిలుస్తారు. సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ లేదా తప్పుడు వ్యక్తులకు వెళ్లకుండా అరికట్టడానికి ఈ విధానాన్ని ఇకపై పర్మనెంట్ చేయనున్నాయి గ్యాస్ కంపెనీలు.
అలాగే మరో కీలక నిర్ణయం ఏంటంటే.. గ్యాస్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా ఒక బుకింగ్ కు మరో బుకింగ్ కు మధ్య ఉండాల్సిన కనీస గ్యాప్ ను 25 రోజులకు పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ గ్యాప్ 45 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ గ్యాప్ సమయం పూర్తి కాకముందే బుక్ చేస్తే ఆ అభ్యర్థన ఆటోమెటిక్ గా రిజెక్ట్ అవుతుంది. ఇక ప్రతినెలా 1 వ తేదీన చమురు సంస్థలు అయిన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్ పీసీఎల్ ధరలను సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు.. హార్మూజ జలసంధి వద్ద నెలకున్న ఉద్రిక్తత నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఆధార్- ఈ కేవైసీ పూర్తిచేయడం తప్పనిసరి చేశారు. కేవైసీ పూర్తి చేయని లబ్దిదారులకు సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పటికే పూర్తిచేసినవాళ్లు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. అలాగే వినియోగదారులు వాట్సాప్, మొబైల్ యాప్స్ లేదా ఆన్ లైన్ పోర్టల్స్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పాత పద్దతిలో బ్లూ బుక్ చూపిస్తే సరిపోదని.. కచ్చితంగా డిజిటల్ వెరిఫికేషన్ ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications