డోంట్ మిస్: నేడు ఒక్కరోజే మూడు విశేష పర్వదినాలు: ఇలా చేయండి
నేడు బుద్ధ పూర్ణిమ. గౌతమ బుద్ధుడు జన్మించిన రోజు. బౌద్ధ ధర్మంలో అత్యంత పవిత్ర పండుగగా జరుపుకొంటారు. గౌతమ బుద్ధుని జననం, జ్ఞానోదయం, మహాపరినిర్వాణాలను ఈ పర్వదినాన స్మరిస్తారు. సిద్ధార్థుడు వైశాఖ పౌర్ణమి నాడు జన్మించాడు. రాజుగా భోగభాగ్యాలతో జీవించినా, సత్యాన్వేషణ కోసం రాజభవనాన్ని వీడి అడవుల బాట పట్టినవాడు. సంవత్సరాల కఠోర తపస్సు, ధ్యానం అనంతరం వైశాఖ పౌర్ణమి నాడే జ్ఞానోదయం పొందాడు.
బుద్ధ పూర్ణిమ.. కరుణ, అహింస, ధ్యానం, జ్ఞాన మార్గాన్ని అనుసరించడానికి అవకాశాన్ని ఇస్తుంది. బుద్ధుని అహింసా సిద్ధాంతాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ, ప్రజలను శాంతి, కరుణ, సామరస్యంతో జీవించడానికి ప్రేరేపిస్తుంది. బుద్ధ పూర్ణిమను వైశాఖ పౌర్ణమి నాడు ఆచరిస్తారు.

పౌర్ణమి తిథి గురువారం రాత్రి 9:12 కు ప్రారంభమైంది. ఈ రాత్రి 10:52 నిమిషాల వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం: ఉదయం 4:16 - 4:57, అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:52 - 12:45, విజయ ముహూర్తం: మధ్యాహ్నం 2:31 - 3:24 నిమిషాల వరకు కొనసాగుతాయి.
నేడు వైశాఖ పౌర్ణమి కూడా. దీనికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే కూర్మజయంతి కూడా నేడే. ఇలా ఒకేరోజున మూడు విశేష పర్వదినాలు సంతరించుకుని రావడం అరుదు. పైగా శుక్రవారం. అమ్మవారికి అంకితం చేసిన రోజు. వైశాఖ పౌర్ణమి నాడు పాటించాల్సిన కొన్ని ఉదయాన్నే పవిత్ర స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంటిని శుభ్రపరిచి, బుద్ధుని లేదా వైశాఖ పౌర్ణమి అయినందున విష్ణువు విగ్రహం/ఫోటోను ప్రతిష్టించాలి.
ఆత్మశుద్ధికి ప్రతీకగా విగ్రహంపై పూల రేకులు కలిపిన నీటిని పోయాలి. సత్యనారాయణ కథ పఠించడం వల్ల శ్రేయస్సు, శాంతి లభిస్తాయి. విష్ణు విగ్రహం/ఫోటోను పసుపు వస్త్రాలు, పూలతో అలంకరించాలి. దీపం వెలిగించి, ఇంట్లో చేసిన తీపిని నైవేద్యంగా సమర్పించాలి. పూజానంతరం హారతి ఇచ్చి, ప్రసాదాన్ని పంపిణీ చేయాలి. సాయంత్రం, ఇంటి ద్వారం వద్ద లేదా తులసి మొక్క దగ్గర నెయ్యి దీపాలను వెలిగించాలి. పూజతో పాటు ఆహారం, వస్త్రాలు, నీటిని దానం చేయడం కూడా ఈ రోజు విశేష ఫలితాలనిస్తుంది.
వైశాఖ పౌర్ణమి నాడు భగవద్గీత పఠనం అశ్వమేధ యాగ ఫలితానికి సమం. విష్ణు సహస్రనామ పారాయణం ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. విష్ణువుకు పాలు, నీటితో అభిషేకం వైకుంఠ ప్రాప్తినిస్తుందని, శ్రీమద్ భాగవత కథా శ్రవణం పాప విముక్తి చేస్తుందని నమ్ముతారు. బోధ్ గయా సందర్శన, బోధి వృక్ష పూజ ఈ రోజు ప్రయోజనకరమైనవి. సత్యనారాయణ పూజానంతరం రాత్రి చంద్రునికి ప్రార్థనలు చేయడం ఆచారం. ఇది మానసిక శాంతి, సంతోషం, శ్రేయస్సును ప్రసాదిస్తుందని నమ్మకం.
బుద్ధ పూర్ణిమ రోజున కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అబద్ధాలు పలకడం, ఇతరులను దూషించడం, తామస ఆహారం తీసుకోవడం మానుకోవాలి. సంయమనంతో, శాంతియుతంగా ప్రవర్తించడం అవశ్యకం. నిజమైన శాంతి, సంతోషం బయట కాకుండా మనలోనే ఉన్నాయని బుద్ధుని బోధనలు చెబుతాయి. మనిషి మొదట తనను తాను జయించాలి, అప్పుడే నిజమైన విజయం, సంతృప్తి సిద్ధిస్తాయి.
కొన్ని వస్తువులు కొనుగోలు చేయొద్దు. బుద్ధ పౌర్ణమి రోజున ఇనుము వస్తువులు కొనుగోలు చేయకూడదు. ఇనుమును శని గ్రహానికి, కఠినత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున దీన్ని కొనడం ఇంట్లో ప్రతికూల శక్తిని కలిగిస్తుందని నమ్ముతారు. చర్మంతో చేసిన వస్తువులు కూడా కొనకూడదు. చమురు చనిపోయిన జంతువుల నుంచి వస్తుంది కాబట్టి ఇది తామసికమైనదిగా పరిగణిస్తారు. బుద్ధ పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున వీటి కొనుగోలు చేయకూడదు.
పదునైన వస్తువులు, కత్తిలాంటివి కొనవద్దు. పదునైన వస్తువులు హింసకు, కఠినత్వానికి ప్రతీకలు, ఇవి ఈ రోజున శాంతి, కరుణకు సంబంధించిన భావాలకు విరుద్ధం. నలుపు రంగు వస్తువులు కూడా కొనకూడదు. నలుపు రంగు అనేక విశ్వాసాలలో ప్రతికూల శక్తికి, శని గ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు, కాబట్టి ఈ రోజున దీనికి దూరంగా ఉండటం మంచిది.
మానసిక శాంతి, సుఖ-సమృద్ధుల కోసం వైశాఖ పౌర్ణమి నాడు చంద్రదేవుని పూజించడం అత్యంత శుభకరం. చంద్రోదయం సమయంలో ఒక పాత్రలో పచ్చి పాలు, నీరు, తెల్లటి పూలు, అక్షతలు కలిపి "ఓం సోం సోమాయ నమః" అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. రాత్రిపూట ఖీర్ను నైవేద్యంగా సమర్పించి, చంద్రుని వెలుగులో ధ్యానం చేయడం వల్ల జాతకంలోని చంద్రదోషాలు తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications