మర్మమేమిటో?: కెసిఆర్ను పక్కన పెట్టిన చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుల మధ్య ఫ్రెండ్షిప్ బలపడిందని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార సభల ద్వారా తేటతెల్లమవుతోందని చెబుతున్నారు.
మంగళవారం నాడు నిజాం కళాశాలలో బిజెపి - టిడిపి భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు తన ప్రసంగంలో కెసిఆర్ను విమర్శిస్తూ ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదు. టిడిపి - బిజెపి అభ్యర్థులకు ఓటు వేయాలని, హైదరాబాదును నేనే అభివృద్ధి చేశానని చెప్పారు.
తాను కార్యకర్తలకు నేతలకు అందుబాటులో ఉంటానని, ఎక్కడికీ వెళ్లిపోలేదని పార్టీకి భరోసా కల్పించారు. అయితే, కెసిఆర్ పైన ఎక్కడా విమర్శలు గుప్పించలేదు. గతంలో ఖబడ్దార్ కేసిఆర్.. అంటూ చంద్రబాబు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో తెరాస నేతలు కూడా చంద్రబాబును ప్రధానంగా లక్ష్యంగా చేసుకోవడం లేదు. గతంలో తెరాస నేతలు మాట్లాడితే చాలు.. అందులో చంద్రబాబుపై విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు వారు చంద్రబాబును పెద్దగా టార్గెట్ చేయడం లేదు.
ఇందుకు చంద్రబాబుకు ఓటుకు నోటు కేసు, కెసిఆర్కు ఫోన్ ట్యాపింగ్, దాంతో పాటు కేంద్రమంత్రిగా ఉన్నప్పటి ఓ విచారణ... కారణంగా చాలామంది భావిస్తున్నారు. చంద్రబాబు కెసిఆర్ పైన, తెరాస పైన, ఇతర పార్టీల పైన విమర్శలు చేయలేదు.
చంద్రబాబు
హైదరాబాద్లో అడుగు పెట్టడం లేదంటూ తనపై వచ్చిన విమర్శిస్తులకు బదులిస్తూ... తాను ఎప్పటికీ నగరాన్ని గుర్తుంచుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. తన హయంలో హైదరాబాద్లో అభివృద్ధికి చేసిన కృషిని చంద్రబాబు వివరించారు.
చంద్రబాబు
హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపేందుకు ప్రపంచం మొత్తం తిరిగానని, అమెరికాలో 14 రోజుల పాటు వీధి వీధికి వెళ్లి బిల్గేట్స్ని కష్టపడి కలిసి నగరానికి రమ్మని విజ్ఞప్తి చేశానని, ఇదంతా మన పిల్లలకు ఐటీ ఉద్యోగాలు రావాలని, వారంతా ఆనందంగా ఉండాలనే చేశానని చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబు
అలా కష్టపడి తొమ్మిది ఏళ్లల్లో సైబరాబాద్ను రూపొందించుకున్నామని, ఫలితంగానే 4 లక్షల మందికి ప్రత్యక్షంగా, 14 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాల లభించాయని చంద్రబాబు అంటూ హైటెక్ సిటీ ప్రస్థానాన్ని గుర్తు చేశారు.
చంద్రబాబు
నగరంలోని రహదారులను వెడల్పు చేయడంతో పాటు తమ ప్రభుత్వం హయాంలోనే ఎన్డీయేతో కలిసి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లుగా చంద్రబాబు తెలిపారు.
చంద్రబాబు
నల్సార్, ఐఎస్బీ వంటి ప్రముఖ విద్యా సంస్థలను భాగ్యనగరానికి రప్పించి నాలెడ్జ్ నగరంగా తీర్చిదిద్దాని, విజన్ 2020 పేరుతో లక్ష్యాన్ని నిర్దేశించుకుని హైదరాబాద్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామని, ఇంకా ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
చంద్రబాబు
ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు వారు ఒక్కటేనని, కాకపోతే..విభజన జరిగిన తీరే అందరికీ ఆమోదయోగ్యంగా లేదని చంద్రబాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లలాంటివని పునరుద్ఘాటించారు.
చంద్రబాబు
రెండు రాష్ట్రాలు ఒకటి కావాలి.. కలిసి కట్టుగా అభివృద్ధిలో ముందుకు సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. నేనేప్పుడు కేంద్ర మంత్రుల్ని కలిసినా ఏపీలాగే తెలంగాణ కూడా వెనుకబడిన రాష్ట్రమే అందుకే దానికి కూడా వీలైనంత ఎక్కువ సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తుంటానని చెప్పారు.
చంద్రబాబు
కష్టకాలంలో పార్టీ కోసం త్యాగాలుచేసిన కార్యకర్తల్ని ఎప్పటికీ మరువనని చంద్రబాబు చెప్పారు. నేను ఎక్కడకీ వెళ్లిపోలేదని, అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు.