జైరాం సాకు: కాంగ్రెసుకు కెసిఆర్ సలాం? (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విలీనం విషయంలోనే కాదు, పొత్తు విషయంలో కూడా కాంగ్రెసుకు ఓ నమస్కార బాణం పడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసుతో సంబంధాలపై నిర్ణయం తీసుకోవడానికి శనివారం జరగాల్సిన పార్టీ పోలిట్బ్యూరో సమావేశాన్ని కెసిఆర్ ఈ నెల 3వ తేదీకి వాయిదా వేశారు.
శుక్రవారంనాడు టిడిపి శాసనసభ్యులు రత్నం, మహేందర్ రెడ్డిలను పార్టీలో చేర్చుకున్న సమయంలో కెసిఆర్ మాట్లాడిన తీరు చూస్తుంటే కాంగ్రెసుతో స్నేహసంబంధాలకు ఇష్టపడడం లేదని అర్థమవుతోంది. అంతేకాకుండా, తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు ఓ ప్రముఖ తెలుగు టీవి కార్యక్రమంలో మాట్లాడిన తీరు గానీ, మరో శాసనసభ్యుడు కెటి రామారావు మరో టీవి చానెల్తో మాట్లాడిన తీరు గానీ కాంగ్రెసుకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చాయి.
కేంద్ర మంత్రి జైరాం రమేష్ రాష్ట్ర పర్యటనలో చేసిన వ్యాఖ్యలు కెసిఆర్కు కాంగ్రెసుతో దూరంగా ఉండడానికి సాకుగా దొరికాయి. కెసిఆర్తో మిగతా తెరాస నాయకులంతా జైరాం వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. కెసిఆర్ అధికారంలోకి వస్తే దొరల రాజ్యం వస్తుందని జైరాం తెలంగాణ జెఎసి నాయకులతో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా, వ్యక్తిగతంగా తెలంగాణ ఇవ్వడం తనకు ఇష్టం లేదని జైరాం చేసిన వ్యాఖ్యలకు కెసిఆర్ మండిపడ్డారు.

జైరాంపై కెసిఆర్ మండిపాటు
సర్పంచ్గా కూడా గెలవలేని జైరాం రమేష్కు తెలంగాణ సెంటిమెంట్ ఏం తెలుసనని కెసిఆర్ శుక్రవారంనాటి సభలో వ్యాఖ్యానించారు.

కార్యకర్తల అభిప్రాయం కోరారు..
తెరాసను కాంగ్రెసులో విలీనం చేయాలా, వద్దా అంటూ కెసిఆర్ శుక్రవారంనాటి సభలో కార్యకర్తల అభిప్రాయం కోరారు.

హామీల వర్షం..
బంగారు తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత తనదేనని, తెలంగాణ పునర్నిర్మాణానికి మరో సమరం చేయాలని ఆయన చెప్పారు. దీన్నిబట్టి తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకోవాలనే ఎత్తుగడతో ఆయన సాగుతున్నట్లు అర్థమవుతోంది.

అన్నీ నేనే చేస్తా...
తెలంగాణ రాష్ట్రంలో తాను చేయదలుచుకున్న విషయాలను కెసిఆర్ వివరించారు. ఒక్కో వర్గానికి తాను చేయదలుచుకున్న విషయాలను అన్నింటినీ వివరించారు. దీన్నిబట్టి తన చేతుల్లోనే అధికారం ఉంటుందనే సంకేతాలు పంపించారు.

భవిష్యత్తుపై దృష్టి..
కాంగ్రెసులో పార్టీని విలీనం చేయదలుచుకుంటే కెసిఆర్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను, నాయకులను ఈ రకంగా ఆహ్వానించేవారు కాదనే మాట వినిపిస్తోంది.

కాంగ్రెసు తీరుపై గుర్రు..
ఒకవైపు విలీనం చేయాలని అడుగుతూనే తన పార్టీకి చెందిన శాసనసభ్యుడు అరవింద్ రెడ్డిని కాంగ్రెసు ఆహ్వానించడంపై కెసిఆర్ గుర్రుమంటున్నట్లు తెలుస్తోంది.

టిడిపిని దెబ్బ తీయడమే లక్ష్యంగా..
శుక్రవారంనాడు జరిగిన సభలో కెసిఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. చివరి వరకు తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు.

టిడిపిని ఖాళీ చేయండి..
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రత్నం, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిలను పార్టీలోకి ఆహ్వానించిన కెసిఆర్ టిడిపిని ఖాళీ చేయాలని ఆ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు

విజయశాంతి సమస్య..
కాంగ్రెసు పార్టీ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విజయశాంతిని తీసుకోవడంపై కూడా కెసిఆర్ కినుకగా ఉన్నట్లు చెబుతున్నారు.

కాంగ్రెసు చేతుల్లో పెట్టడమా..
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కాంగ్రెసు చేతుల్లో పెట్టవద్దని పార్టీ నాయకుల నుంచే కాకుండా తెలంగాణ ప్రజా సంఘాల నేతల నుంచి కూడా కెసిఆర్పై ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం.

వ్యూహాత్మకంగా కెసిఆర్..
కాంగ్రెసులో పార్టీని విలీనం చేస్తే తెలుగుదేశం పార్టీకి అవకాశం కల్పించినట్లవుతుందని, తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయాలంటే కాంగ్రెసుకు ప్రత్యర్థిగా తానే నిలువాలని కెసిఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications