తెలంగాణ: కిరణ్ రెడ్డి వద్ద రహస్య అస్త్రం?
గురువారంనాడు శాసనసభకు వచ్చిన వెంటనే తన ఛేంబర్కు రావాలని సీమాంధ్ర మంత్రులకు ఆహ్వానం పంపించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, వట్టి వసంతకుమార్, డొక్కా మాణిక్యవరప్రసాద్, పసుపులేటి బాలరాజు, సాకే శైలజానాథ్, శత్రుచర్ల విజయరామారాజు, కన్నా లక్ష్మినారాయణ, పార్థసారథి, పితాని సత్యనారాయణ తదితరులు హుటాహుటిన ముఖ్యమంత్రి ఛేంబర్కు చేరుకున్నారు.
రాజీనామా చేయడానికి సిద్ధపడి తమను పిలిచారేమోనని భావించిన సీమాంధ్ర మంత్రులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన వద్ద రహస్య అస్త్రం ఉందని, ప్రయోగిస్తానని చెప్పారు. తాను శాసనసభలో చేయబోయే ప్రసంగం గురించి ఆయన వారితో చర్చించారు. సమావేశం మధ్యలో ఉండగానే ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రికి ఫోన్ వచ్చింది. తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చకు రాష్ట్రపతి మరో వారం గడువు పొడిగించినట్లు సమాచారం అందింది.
తాను శాసనసభలో సమైక్యాంధ్ర కోసం తీర్మానాన్ని ప్రతిపాదిస్తానని, వోటింగ్కు డిమాండ్ చేస్తానని ముఖ్యమంత్రి సీమాంధ్ర మంత్రులతో చెప్పారు. ఈలోగా ఓ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగ పాఠాన్ని చదివి, చాలా బాగుందని చెప్పారట.
తమతో ఏదీ మాట్లాడని ముఖ్యమంత్రి ఈసారి ప్రత్యేకంగా తమను పిలిచి ఆ విషయం చెప్పడంలోని ఆంతర్యమేమిటని సీమాంధ్ర మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారని జాతీయ మీడియా చానెళ్లలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారమంతా నడిచింది. ఇంతకీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రయోగించబోయే అస్త్రం రాజీనామానా, శాసనసభ రద్దకు సిఫార్సా అనేది తేలడం లేదు.