తెరాసలో చిచ్చు: కేసీఆర్కు నారాయణపేట ఎమ్మెల్యే షాక్
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో కొత్త జిల్లాల ఏర్పాటు చిచ్చు రాజేసేలా కనిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు పైన సొంత పార్టీలోను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అసంతృప్తి సెగలు తగులుతున్నాయి.
తెలంగాణలో పాత పది జిల్లాలు, గతంలో ప్రతిపాదించిన పదిహేడు జిల్లాలకు తోడు తాజాగా నాలుగు (సిరిసిల్ల, జనగామ, గద్వాల్, అసీఫాబాద్) జిల్లాలు.. మొత్తం 31 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఒక్కో జిల్లాలో సగటున 3 లక్షల కుటుంబాలు ఉంటాయి.
జిల్లాల ఎఫెక్ట్: మినిస్టర్ చందులాల్ కంటతడి, మంత్రివై ఇలాగా.. కేసీఆర్ఈ కొత్త జిల్లాల ఏర్పాటు పైన చాలామంది సంతృప్తిగా ఉన్నప్పటికీ.. విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అదే సమయంలో అధికార పార్టీలోను రగడ కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయం మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ముఖ్యమంత్రికి హితవు పలికాయి. బీజేపీ మాత్రం అడిగిన వారికల్లా ఓ జిల్లా ఇచ్చుకుంటే వెళ్తే ఎలాగని, శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని చెబుతున్నాయి.
ఇక, మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటను జిల్లాగా చేయాలని లేదంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అధికార తెరాస పార్టీ ప్రజాప్రతినిధి రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నారాయణపేటను జిల్లా చేయకుంటే రాజీనామా చేస్తానన్నారు. ఇదే విషయాన్ని ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే చెప్పారని తెలుస్తోంది.
ఇప్పటికే మంత్రి అజ్మీరా చందూలాల్ కొత్త జిల్లాల ఏర్పాటులో తన నియోజకవర్గం ములుగుకు అన్యాయం జరిగిందని వాపోయారు. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జిల్లా కోసం రాజేందర్ రెడ్డి రాజీనామా చేస్తానని చెప్పడం గమనార్హం.