పదవులు 2:1: డిప్యూటీ సిఎంకు శివసేన పట్టు
ముంబై: తొలిసారిగా మహారాష్ట్రాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్న శివసేన పార్టీ తన డిమాండ్లతో ఆ పార్టీపై ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో శివసేన నేతలతో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చర్చలు జరుపుతున్నారు. కాగా, శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి శివసేన హాజరైన విషయం తెలిసిందే. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి శివసేన హాజరైంది.
కాగా, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు.. విశ్వాస పరీక్ష కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వానికి 15 రోజుల గడువు ఇచ్చారు. నవంబర్ 15న విశ్వాస పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో శివసేన మద్దతు బిజెపి ప్రభుత్వానికి అవసరమైంది. తమ డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వంలో పదవులు ఇవ్వకపోతే విశ్వాస పరీక్షలో బిజెపికి మద్దతు ఓటు వేసే ప్రసక్తి లేదని శివసేన వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రభుత్వంలో తమ పార్టీకి 2:1 మంత్రి పదువులు ఇస్తే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు తమకు సమ్మతమేనని శివసేన పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఈ పదవులతోపాటు డిప్యూటీ సిఎం పదవిని కూడా శివసేన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
32మంది శాసనసభ్యులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్న దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంలో 20 మంత్రి పదవులు బిజెపికి, మరో 10 మంత్రివులు దక్కే అవకాశం ఉంది(ఇందులో ఐదు కేబినెట్ ర్యాంకు, మరో ఐదు రాష్ట్ర మంత్రి స్థాయివి). మరో రెండు మంత్రి పదవులు భాగస్వామ్య పక్షాలైన చిన్న పార్టీలకు కేటాయించే అవకాశం ఉంది.
288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి 121 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీకి కేవలం 24 అవసరమయ్యాయి. బిజెపి మొత్తం గెలిచిన 122 స్థానాలైనప్పటికీ.. కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో ఓ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఆ సంఖ్య 121కి చేరుకుంది. దీంతో బిజెపి.. శివసేనతోపాటు చిన్న భాగస్వామ్య పార్టీలను కలుపుకుని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఎన్నికల్లో శివసేన 63 స్థానాలు, ఎన్సీపి 41 స్థానాలు గెలుచుకున్నాయి. ఎన్సీపి కూడా బిజెపి ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు ఆసక్తి చూపినప్పటికీ.. బిజెపి మాత్రం చిరకాల భాగస్వామి అయిన శివసేన పార్టీతోనే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకుంది.












Click it and Unblock the Notifications