సంచలనమైన ఆత్మహత్యలు: 2 రోజుల్లోనే ఏడుగురు, తట్టుకోలేని మనస్తత్వాలే!..
తల్లి కాకర్ల రేణుక మౌనికను మందలించింది. ఈ విషయమై గతంలోను ఇంట్లో ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
హైదరాబాద్: చిన్నపాటి మందలింపును కూడా తట్టుకోలేని మనస్తత్వం. అమ్మ కాకపోతే ఇంకెవరు చెప్తారు?.. అన్న ఆలోచన కూడా లేనితనం. క్షణికావేశంతో.. ఉద్వేగాన్ని నియంత్రించుకోలేక ఉరితాడు వైపే మొగ్గుచూపుతున్న వైనం.
ఒకరా.. ఇద్దరా.. రెండు రోజుల్లో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతా 15-30 ఏళ్ల లోపువారే!. ఏం కష్టమొచ్చిందని అంత కఠిన నిర్ణయం తీసుకున్నారు. అమ్మ మందలించిందని ఒకరు, ఉద్యోగం రాలేదని మరొకరు, చదవలేకపోతున్నందుకు ఇంకొకరు.. ఇలా చిన్న చిన్న కారణాలకే జీవితాలను పణంగా పెడుతున్నారు.
చాటింగ్ వద్దన్నందుకు:
హైదరాబాద్ సూరారం కాలనీలో సాయి దుర్గామౌనిక(20) అనే బీటెక్ విద్యార్థిని బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అంతకుముందు సోషల్ మీడియాలో తన జీవితం దుర్బరంగా మారిందంటూ ఆమె వాపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.
అయితే ఆమె ఆత్మహత్యకు సంబంధించిన వాస్తవాలు మరోలా ఉన్నాయి. ఎప్పుడూ ఫేస్ బుక్ లో మునిగితేలుతుందన్న కారణంతో.. తల్లి కాకర్ల రేణుక మౌనికను మందలించింది. ఈ విషయమై గతంలోను ఇంట్లో ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ నేపథ్యం:
కాకర్ల రేణుక, చంద్రశేఖర్ దంపతులకు సాయిదుర్గామౌనిక(20), వరప్రసాద్ సంతానం. 10 క్రితమే భర్త చంద్రశేఖర్ భార్యాపిల్లల్ని వదిలేసి వెళ్లిపోతే.. తల్లి రేణుకే కుటుంబాన్ని పోషిస్తూ వస్తోంది.
వరప్రసాద్ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా సాయి దుర్గామౌనిక మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది.ఇటీవల ఫేస్బుక్ చాటింగ్ ఆమెకో వ్యవసనంలా మారింది. ఈ విషయమై బుధవారం తల్లి మందలించింది. దీంతో మౌనిక మనస్తాపానికి గురైంది. తల్లి, సోదరుడు ఇంట్లో లేని సమయంలో కిటికి గ్రిల్స్ కు చున్నీతో ఉరేసుకుంది.
సంయుక్తది మరో కథ:
నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం రాణంపల్లి గ్రామానికి చెందిన సంయుక్త(17) బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఎంత చదివినా బుర్రకెక్కడం లేదని సంయుక్త మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. ఆ మనస్తాపంతోనే ఆమె ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు చెబుతున్ననారు. మాదాపూర్లోని శ్రీచైతన్య మెడికల్ క్యాంప్సలో హాస్టల్ గదిలో బుధవారం రాత్రి సూసైడ్ నోట్ రాసి ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
ఉద్యోగం రాలేదని:
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వాడపల్లికి చెందిన హరికృష్ణ (23) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన హరికృష్ణ టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఇరిగేషన్ ఏఈ పరీక్షలు రాశాడు. ఇటీవల విడుదల చేసిన 'కీ'లో తనకు తక్కువ మార్కులు వస్తున్నాయని గ్రహించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సాంగ్వికి చెందిన మహేందర్(28)ది కూడా ఇదే విషాదం. ఉద్యోగం రాలేదన్న కారణంతో బుధవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తల్లిదండ్రుల గొడవ చూడలేక:
తరుచూ గొడవపడే తల్లిదండ్రులను చూసి తట్టుకోలేక మాలతి(15)ఆత్మహత్య చేసుకోవడం ప్రతీ ఒక్కరిని కలచివేసింది. ఏపీలోని విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం శిఖబడిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి పూర్తి చేసిన మాలతి గురువారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ట్రిపుల్ ఐటీలో ఒకరు, అప్పుల బాధతో మరొకరు:
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో చదువుతున్న సాగిరెడ్డి పూర్ణ లక్ష్మీనరసింహమూర్తి(16) నూజివీడులో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన కారణాలు తెలియరాలేదు. ఇక అప్పుల బాధ భరించలేక హైదరాబాద్ జిల్లా మైలార్దేవ్పల్లికి చెందిన షాహిద్ హుస్సేన్(30) అనే కార్పెంటర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల వాళ్ల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పిన షాహిద్.. వారి పేర్లు, వేధింపులను ఫోన్లో రికార్డు చేసి మరీ చనిపోయాడు.