హైదరాబాద్ మీదే కెసిఆర్: దానం నాగేందర్కు వల?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు హైదరాబాద్కు చెందిన ఇతర పార్టీల నాయకులకు వల విసురుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను పార్టీలో చేర్చుకుని ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి దానం నాగేందర్కు ఆయన వల వేసినట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్లో జరిగే హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికలపై కన్నేసిన కెసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
అయితే, దానం నాగేందర్ కూడా టిఆర్ఎస్లో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. కొద్ది వారాల క్రితమే ఆయన తాను టిఆర్ఎస్లో చేరుతానని కెసిఆర్కు ఫీలర్లు పంపారని, అప్పుడు కెసిఆర్ ప్రతిస్పందించలేదని అంటున్నారు. ఆ తర్వాత దానం నాగేందర్ విషయంపై కెసిఆర్ పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవరావుతో పాటు ఇతర నాయకులతో సుదీర్ఘంగా చర్చించారని అంటున్నారు. దానికితోడు, హైదరాబాద్కు చెందిన మంత్రులు టి పద్మారావు, తలసాని శ్రీనివాస యాదవ్, నాయని నర్సింహారెడ్డిలతో కూడా ఆయన చర్చించినట్లు సమాచారం.

నాగేందర్ను పార్టీలో చేర్చుకోవడానికి అవసరమైన ప్రాతిపదికలను వారు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దానం నాగేందర్ కాంగ్రెసు హైదరాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయనకు హైదరాబాద్లోని ఖైరతాబాద్, ఆసిఫాబాద్, జూబ్లీహిల్స్లతో పాటు ఇతర శాసనసభ నియోజకవర్గాల్లో కూడా బలమైన అనుచర గణం ఉంది. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేసి బిజెపి చేతిలో ఆయన ఓడిపోయారు.
దానం నాగేందర్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆ సామాజిక వర్గం హైదరాబాదులో గణనీయంగా ఉంది. దీంతో వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల్లో దానం నాగేందర్ను ముందు పెట్టాలనే ఆలోచన కూడా కెసిఆర్కు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించే ఆలోచన కూడా లేకపోలేదని అంటున్నారు. అయితే, ఈ విషయంపై కెసిఆర్ దానం నాగేందర్కు ఇప్పటి దాకా ఏ విధమైన హామీ ఇవ్వలేదని అంటున్నారు.
దానికితోడు, దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి తనయుడు మాజీ శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా కెసిఆర్కు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసు ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డితో గొడవ పడిన విష్ణు ఈ మధ్య కెసిఆర్ను కూడా కలిశారు. అయితే, దానం నాగేందర్తో విష్ణుకు విభేదాలున్నాయి. విష్ణు కూడా టిఆర్ఎస్లో చేరుతారనే పుకార్లు బయలుదేరాయి. ఈ ఇరుపురిని కూడా కెసిఆర్ పార్టీలోకి తీసుకుంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications