హోదాపై కేంద్రం కప్పదాట్లు: ఆత్మరక్షణలో బాబు.. అధికార పక్షం ప్లేట్ ఫిరాయింపు
జీఎస్టీ వస్తే హోదా కలిగిన రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఉండవన్న వాదన ఉత్త బూటకమని తేలిపోయింది.పలు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కింద లభించే పన్ను రాయితీలను కేంద్రం తాజాగా మరో పదేళ్ల పాటు పొడిగించింది.
హైదరాబాద్/ అమరావతి: 'ప్రత్యేక హోదా' జీఎస్టీ వస్తే హోదా కలిగిన రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఉండవన్న వాదన ఉత్త బూటకమని తేలిపోయింది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్లకు ప్రత్యేక హోదా కింద లభించే పన్ను రాయితీలను కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో పదేళ్ల పాటు పొడిగించింది. ఈ మేరకు 4 రోజుల క్రితం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబుతోపాటు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న టీడీపీ మంత్రులు పచ్చి అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేశారని దీంతో తేలిపోయిందని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నోట్లో నానుతున్న అంశం.
మూడున్నరేళ్ల క్రితం నుంచి దేశ రాజధాని హస్తిన నుంచి హైదరాబాద్ వరకు నినాదం ఇది. కానీ ఇది కాలం చెల్లిన అంశమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014 ఫిబ్రవరి 20న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సాక్షిగా ప్రకటించారు. కానీ ప్రస్తుత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, నాటి విపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ తదితరులు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.

4,284 కంపెనీలకు ఇలా ఆర్థిక ప్రయోజనాలు
జీఎస్టీ అమల్లోకి వచ్చిన జూలై ఒకటో తేదీ నుంచి 2027 మార్చి 31వ తేదీ వరకు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఈ రాయితీలు అమల్లో ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. ఇందుకోసం రూ. 27,413 కోట్లను కేటాయించడానికి కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల 4,284 కంపెనీలకు ఆర్థిక ప్రయోజనం చేకూరనున్నదని, మార్గదర్శకాలను ఆరు వారాల్లో విడుదల చేస్తామని జైట్లీ తెలిపారు.

ఓటుకు నోటు కేసులో ఇలా చంద్రబాబు
2014 ఎన్నికల్లో ఐదేళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని నాటి బీజేపీ అగ్రనేతలుగా ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఊరూవాడా తిరుగుతూ వాదించారు. ఎన్నికలు పూర్తయి ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని. ఏడాది తిరిగే సరికి తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను అభాసు పాల్జేసేందుకు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బేరసారాలు జరిపి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయింది. కానీ ఏసీబీ నిఘా వల్ల దొరికిపోవడంతో తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్రెడ్డి జైలు పాలయ్యారు. ఫోన్లో మాట్లాడి దొరికిపోవడంతో మధ్యేమార్గంగా హైదరాబాద్ నగరాన్ని వీడి విజయవాడకు చేరుకున్న చంద్రబాబు మరో ఏడాదిలోగానే అమరావతి పేరిట నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి శరవేగంగా పూనుకున్నారు.

హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఇలా
14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ఇలా ‘మంగళం' అన్నారు
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చర్చ డిమాండ్ ముందుకు వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి, కాంగ్రెస్, వామపక్షాలు, యువజన విద్యార్థి సంఘాలు, సినీ రంగ ప్రముఖులు ప్రత్యేక హోదా కోసం ఆందోళన బాట పట్టాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా డిమాండ్ ముందుకు వచ్చినప్పుడల్లా ప్రత్యేక ప్యాకేజీ చర్చ ముందుకు తెచ్చారు అధికార తెలుగుదేశం పార్టీ నేతలు. టీడీపీతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు సైతం.. ప్రత్యేక హోదాకు కాలం చెల్లిందన్న వాదనలు వినిపించారు. ముందు 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ‘ప్రత్యేక హోదా' డిమాండ్ అమలు ప్రక్రియ ముగిసిపోతుందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి వంటి వారు ప్రస్తావించారు. తాజాగా జీఎస్టీ అమలుతో ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అమలు తీరిపోతుందని చేసిన వాదన తాజాగా కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం వట్టిదేనని తేలిపోయింది.

రిఫండ్ రూపంలో చెల్లింపులు జరపాలని నిర్ణయం
నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ - 2007 కింద ఏర్పాటైన సంస్థలతో పాటు ప్రత్యేక హోదా కలిగిన కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పాటైన కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత మొదటి పదేళ్ల పాటు ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ ఇప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ చట్టం రద్దు కావడంతో ఈ నిబంధనల కింద ఇచ్చే రాయితీలు జీఎస్టీ రాకతో రద్దయిపోయాయి. దీంతో పన్ను రాయితీలను పదేళ్ల పాటు రిఫండ్ రూపంలో చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జీఎస్టీలో కేంద్రం వాటాగా వచ్చే సీజీఎస్టీ, ఐసీఎస్టీ పన్నులను తిరిగి చెల్లించనున్నది. దీనికి రూ. 27,413 కోట్లు అవసరమని పారిశ్రామిక ప్రోత్సాహక విధాన విభాగం (డీఐపీపీ) అంచనా వేసింది.

హోదా ముగిసిన అధ్యాయమన్న అధికార పక్షం
ప్రత్యేక హోదా కాలం చెల్లిన అంశమని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలు సాకులు చెబుతున్నా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర రాజకీయ పార్టీలు దీనిపై గట్టిగా పోరాడుతూ వచ్చాయి. ఢిల్లీ నుంచి గల్లీదాకా పోరాటాలు చేయడమే కాకుండా పార్లమెంట్ ఉభయసభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పలుమార్లు ప్రస్తావనకు తెచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఒక శుక్రవారం ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించారు. కానీ రెండు సెషన్లు ముగిసిన తర్వాత అది ఆర్థిక బిల్లు అని, విపక్ష సభ్యులు ప్రవేశ పెట్టిన బిల్లును ఆమోదించబోమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వాదించి ఆ ప్రైవేట్ బిల్లు చర్చకు రాకుండా తప్పించేశారు. పోరాడితే తప్ప, ఏదైనా సాధ్యం కాదని రకరకాల అనుభవాలతో ఆందోళనకు దిగేందుకు విపక్షాలు చేసిన ప్రయత్నాలను అధికార తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అణచివేత వ్యూహాలతో అమలుజేస్తూ వచ్చాయి.

రామకృష్ణ బీచ్ దీక్ష యోచన అణచివేత ఇలా
2016లో తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో మరణించిన తర్వాత జల్లికట్టు ఆట పునరుద్ధరణ కోసం చెన్నైలోని మెరీనా బీచ్ సాక్షిగా ఆందోళన సాగించి విజయం సాధించారు. ఈ పోరాట స్ఫూర్తితో విశాఖపట్నంలో ‘రామక్రుష్ణ బీచ్' సాక్షిగా చేపట్టదలిచిన ఆందోళననూ ఉక్కుపాదంతో అణచివేసిన నేపథ్యం చంద్రబాబు సర్కార్ది. లౌక్యం, దౌత్యం, పోరాటం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాను సాధించడం సాధ్యమేనని విపక్షాలు పదేపదే ఉద్ఘాటించాయి. ఇప్పుడు కేంద్రం ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పదేళ్ల పాటు పొడిగించడంతో ప్రతిపక్షాల వాదనకు మరింత బలం చేకూరింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడితే.. అందుకు అవసరమైన రాష్ట్రంలోని అన్ని పార్టీల మద్దతుతో పోరాడితే ఆంధ్రప్రదేశ్కు కూడా ఈ ప్రయోజనాలు దక్కే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.












Click it and Unblock the Notifications