పవన్ కళ్యాణ్కు చెక్: దాసరికి జగన్ బంపర్ ఆఫర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల ఓట్లను చీల్చి, అధికార తెలుగుదేశం పార్టీ బలాన్ని తగ్గించాలనే వ్యూహంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నట్లు కనపిస్తున్నారు. జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ మద్దతు కారణంగా ఎప్పుడూ వైరి వర్గాలుగా సాగే కాపు, కమ్మ సామాజిక వర్గాలు ఏకమై తెలుగుదేశం, బిజెపి కూటమిని గెలిపించాయనే అభిప్రాయం బలంగా ఉంది. అది చాలా వరకు నిజం కూడా.
కాపు సామాజిక వర్గంలో చీలిక తేవడంలో భాగంగానే వైయస్ జగన్ మాజీ కేంద్ర మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణ రావును కలిసినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా దాసరి నారాయణరావుకు ఆయన రాజ్యసభ సీటు ఇవ్వజూపినట్లు కూడా ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచీ కమ్మ సామాజికవర్గం అండదండలున్నాయి. అయితే, కాపు వర్గం కాంగ్రెసు పార్టీని బలపరుస్తూ వస్తోంది.
అయితే, అనూహ్యంగా పవన్ కళ్యాణ్ బిజెపి, టిడిపి కూటమికి మద్దతు ప్రకటించారు. దాంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు లేదా కాంగ్రెసు వైపు ఉంటారని భావించిన కాపు సామాజిక వర్గం ఓటర్లు టిడిపి, బిజెపి కూటమికి మళ్లారు. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనను ఓ సామాజిక వర్గానికి చెందినవాడిగా గుర్తించవద్దని పదే పదే చెప్పినప్పటికీ ఆ కార్డు పనిచేస్తూనే ఉంటుంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టాలనే యోచనలో జగన్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. కాపు సామాజిక వర్గంలోని అసంతృప్త నేతలను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. దాసరి నారాయణ రావుకు కాపు సామాజిక వర్గంలో చెప్పుకోదగిన మద్దతు ఉంది. అయితే, ఆ ఉద్దేశంతోనే దాసరి నారాయణ రావుకు కాంగ్రెసు అధిష్టానం కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. అయితే, చిరంజీవికి ఉన్న మాస్ ఫాలోయింగ్ను చూసి, దాసరి నారాయణ రావును దూరం చేసుకుందని అంటున్నారు.
ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకుని, చిరంజీవికి కేంద్ర మంత్రి పదవిని కాంగ్రెసు అధిష్టానం కట్టబెట్టింది. అయితే, అది కూడా తగిన ఫలితం ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ హవా కొనసాగింది. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్కు విరుగుడుగా అన్ని వైపుల నుంచి కాపు సామాజిక వర్గంలోని అసంతృప్త నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై పోరుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపులను కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఎప్పటికప్పుడు చంద్రబాబుకు సవాళ్లు విసురుతున్నారు. దాసరి నారాయణ రావు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా గళం విప్పితే తమకు కలిసి వస్తుందనే భావనతో వైయస్ జగన్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. కోస్తాంధ్రలో కాపులను తన వైపు తిప్పుకుంటే, రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం వల్ల తాను బలపడవచ్చుననే ఆశతో జగన్ ఉన్నట్లు కనిపిస్తున్నారు.