దారి తప్పిన ఎమ్మెల్యేలు: జగన్ ఆగ్రహం
హైదరాబాద్: తమ పార్టీ శాసనసభ్యులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయాలను అమలు చేయడంలో వారు విఫలమవుతున్నారని, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని ఆయన మండిపడుతున్నారట. శాసనసభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తమ ప్రభావాన్ని చాటలేకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుండా ఎమ్మెల్యేలు సభను అడ్డుకోవాలని పార్టీ తీర్మానించింది. ఇందుకు సంబంధించి పార్టీ నేతలు ఎమ్మెల్యేలకు తగిన దిశానిర్ధేశం కూడా చేశారు. అయితే ఇందుకు భిన్నంగా సభలో సభ్యులు వ్యవహరించారు. ముందుగా సభ సాగకుండా అడ్డుపడినా ఆ తర్వాత సభ సజావుగా సాగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత సభలో చర్చలో పాల్గోనుకూడదని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్ ఎమ్మెల్యేలకు ఆదేశాలను సైతం జారీ చేశారు. కానీ శాసనసభ్యులు మాత్రం జగన్ ఆదేశాలను ధిక్కరించి తెలంగాణ బిల్లుపై చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఆది నుంచి తెలంగాణ బిల్లు విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలతో పాటు పార్టీ శాసనసభ పక్ష నాయకురాలు వైఎస్.విజయమ్మ మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా సభ్యులు వ్యవహరించారని జగన్ ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారని తెలుస్తోంది. వీరి వ్యవహారం వల్ల పార్టీ రచించిన వ్యూహాలు ఫలించకపోవడంతో పాటు ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదని జగన్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సభలో పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మె ల్యులు తమ వంతు వచ్చినప్పుడు మాట్లాడి తిరిగి బయటకు వెళ్లిపోతున్నారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేల తీరు సభలో ఎటుకాకుండా వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పక్షనాయకురాలు విజయమ్మ మాటలను ఎమ్మెల్యేలు భేఖాతరు చేస్తున్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తున్నట్లుగా తెలంగాణ బిల్లుపై తిరిగి వెనక్కి పంపాలని లేదా సభలో సమైక్య తీర్మానం చేసి పంపాలని విధానానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మద్దతు పలకకపోయినా ఆయా పార్టీలు సైతం ఇప్పుడు అదే బాటను ఎంచుకున్నాయి. శాసనసభ్యుల తీరు వల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించింది.