ఇక కేరాఫ్ మంగళగిరి: వైయస్, బాబు బాటలో జగన్!
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, టిడిపి అధినేత, సీఎం చంద్రబాబునాయుడు బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో వైయస్, చంద్రబాబులు పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకుని.. అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జగన్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
'ప్రజా ప్రస్థానం' తరహాలో ఈ పాదయాత్ర కొనసాగించేందుకు జగన్ నిర్ణయించినట్లు సమాచారం. 2014 ఎన్నికల ముందు కూడా ఆయన పాదయాత్ర చేపట్టేందుకు రూట్మ్యాప్ సిద్ధం చేయించారు. అయితే, ఆ సమయంలో ఆయన జైలుకు వెళ్లడంతో ఆ యాత్రను మరో ప్రజా ప్రస్థానం పేరుతో జగన్ సోదరి షర్మిల నిర్వహించారు.
రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు కావస్తున్నా పలు సమస్యలకు పరిష్కారం లభించకపోవడం, రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవడం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేయకపోవడం వంటి విషయాలపై జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారనేదీ ఖరారు కాలేదు.

కేరాఫ్ మంగళగిరి
ఇది ఇలా ఉండగా, ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ తన రాష్ట్ర కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాష్ట్ర రాజధాని ప్రాంతానికి తరలించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలలో స్థలాల్ని పరిశీలించారు.
ఏదో ఒకటి ఖరారు చేసి అక్కడే పార్టీ రాష్ట్ర కార్యాలయంతోపాటు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నివాసం కలిపి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. నవంబరు ఆఖరు లేదా డిసెంబరులో నిర్మాణం ప్రారంభించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీలోని ఏలూరులో ఓటరుగా నమోదు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications