శ్రీబాగ్ ఒప్పందం అంటే ఏమిటీ: కర్నూలులోనే రాజధాని ఎందుకు పెట్టాలి?: సమగ్ర వివరాలివే
శ్రీబాగ్ ఒడంబడిక లేదా శ్రీబాగ్ ఒప్పందం. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించుకోవడంతో ఈ ఒప్పందం.. ప్రజల నోళ్లల్లో నానుతోంది. ప్రత్యేకించి రాయలసీమ వాదుల్లో. ఎలాగూ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న నేపథ్యంలో- పూర్తిస్థాయి రాజధానిని రాయలసీమలోని కర్నూలులో నెలకొల్పాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది.

మద్రాస్ ప్రెసిడెన్సీ
ప్రత్యేక రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరించడానికి ముందు ఈ ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సి పరిపాలనలో ఉండేది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో ఉండేది. దానితోపాటు ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బళ్లారి, ఇతర ప్రాంతాలన్నీ తమిళనాడు కింద ఉండేవి. భాష వేరు కావడం వల్ల తెలుగు మాట్లాడే ప్రజలు వివక్షకు గురవుతున్నారనే కారణంతో తమిళనాడు నుంచి విడిపోవాలని నిర్ణయానికి వచ్చారు.

భాషా ప్రాతిపదికన
భాషా ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలంటే అప్పట్లో రాయలసీమ సహకారం తప్పనిసరిగా కావాల్సి వచ్చింది. కోస్తాంధ్రతో కలిసి ఉండటానికి రాయలసీమ ప్రాంతవాసులు అప్పట్లో పెద్దగా ఆసక్తి చూపలేదట. వారిని ఒప్పించడానికి కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి నాయకులు రాయలసీమవాసులతో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఓ నిర్ణయానికి వచ్చారు. 1937 నవంబర్ 16వ తేదీన అప్పటి మద్రాస్ స్టేట్లోని కాశీనాధుని నాగేశ్వరరావు నివాసంలో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆయన ఇంటి పేరే..
కాశీనాథుని నాగేశ్వర రావు ఇంటి పేరు శ్రీబాగ్. అదే పేరును ఈ ఒప్పందానికి పెట్టారు. దీన్ని పెద్ద మనుషుల ఒడంబడికగా కూడా పిలుస్తారు. సమాన అభివృద్ధిని సాధించడానికే ఈ ఒప్పందం కుదిరింది ఈ రెండు ప్రాంతాలకు చెందిన పెద్ద మనుషుల మధ్య. ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఒక కేంద్రం విశాఖపట్నంలోనూ, మరొక కేంద్రం అనంతపురంలోనూ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ ఒప్పందం ప్రకారం. అత్యంత దుర్భిక్షం, వెనుకబడిన ప్రాంతం కావడం వల్ల జల వనరుల్లో రాయలసీమ ప్రాంతానికి అధిక వాటా దక్కాలని ఇందులో పొందుపరిచారు.

రాజధాని లేదా హైకోర్టుల్లో..
రాష్ట్ర రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటులో రాయలసీమకు చెందిన మెజారిటీ ప్రజలు దేన్ని కోరుకుంటే దానిని రాయలసీమలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఈ ఒడంబడిక ద్వారా కుదుర్చుకున్నారు. కడప కోటిరెడ్డి, కల్లూరు సుబ్బారావు, హెచ్ సీతారామిరెడ్డి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య, పప్పూరి రామాచార్యులు, ఆర్ వెంకటప్పనాయుడు ఈ ఒడంబడిక మీద సంతకాలు చేశారు.

పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో..
తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్.. భాషా ప్రాతిపదికన ఏర్పాటైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రాణత్యాగం చేశారు. 1952 అక్టోబర్ 29వ తేదీన ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. అదే సంవత్సరం డిసెంబరు 15వ తేదీన అమరుడయ్యారు. అమరజీవి అయ్యారు. ఆ తరువాత అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

రాజధానిగా కర్నూలు..
ఇప్పట్లా 13 జిల్లాలతో కూడిన తెలుగు రాష్ట్రం ఆవిర్భవించింది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఏర్పడింది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలును రాజధానిగా ప్రకటించారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో రాజధాని హైదరాబాద్కు తరలి వెళ్లింది. హైదరాబాద్ స్టేట్ ఆంధ్రాలో విలీనం కావడంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కర్నూలు తరలి వెళ్లినప్పటి నుంచీ అన్యాయం జరుగుతోందనే అభిప్రాయం సీమవాసుల్లో నెలకొని ఉంది. అందుకే శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తోన్నాయి.












Click it and Unblock the Notifications