రాయన్కు జాతీయ అవార్డు: ఖుష్బూ షాకింగ్ కామెంట్స్!
తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించి నటించిన 'రాయన్' సినిమాకు ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్గా ధనుష్కు ఇది తొలి నేషనల్ అవార్డు కావడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు ఆ చిత్రంలో ఏముందని జాతీయ అవార్డు ఇచ్చారని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపిక చేసే విధానంపై సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ అవార్డులను ఇచ్చేటప్పుడు అనుసరించే ప్రమాణాలపై ఆమె తన అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది ఎంపికయ్యే కొన్ని సినిమాల కంటే అర్హత, ప్రతిభ ఉన్న అనేక ప్రాంతీయ చిత్రాలు.. ముఖ్యంగా ఒడియా సినిమాలు గుర్తింపు పొందడంలో ఎందుకు విఫలమవుతున్నాయని ఖుష్భూ పరోక్షంగా ప్రశ్నించారు.
ధనుష్ నటించిన 'రాయన్' సినిమాకు లభించిన జాతీయ అవార్డు గురించి ఖుష్భూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా మందిలాగే తనకు కూడా ఈ ఎంపికల వెనుక ఉన్న ప్రమాణాలపై కొన్ని సందేహాలు ఉన్నాయన్నారు. జాతీయ అవార్డులకు సినిమాలను ఎంపిక చేయడానికి జ్యూరీ ఎలాంటి కొలమానాలను ఉపయోగిస్తుందో అర్థం కావడం లేదన్నారు. కొన్ని సార్లు ఈ అవార్డులు సాధించిన సినిమాల కంటే అద్భుతమైన స్టోరీ, నటన ఉన్న ఒడియా చిత్రాలు ఎన్నో వస్తున్నాయని.. మరి అలాంటప్పుడు ఒడియా సినిమాకు తగిన జాతీయ గుర్తింపు ఎందుకు దక్కడం లేదని ఖుష్బూ ప్రశ్నించారు. అందుకే తనకు అవార్డుల విషయంలో ఇలాంటి సందేహాలు వస్తుంటాయని ఆమె తెలిపారు.

ఖుష్బూ సుందర్ 'రాయన్ ' సినిమాను నేరుగా విమర్శించనప్పటికీ.. ఆమె కామెంట్స్ తమిళ, హిందీ, తదితర పెద్ద సినిమా ఇండస్ట్రీలకే జాతీయ అవార్డుల్లో ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందా అనే కోణంలో కొత్త చర్చకు దారితీశాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు అన్ని ప్రాంతీయ భాషా సినిమాలకు సమాన అవకాశాలు, ప్రాతినిధ్యం లభిస్తున్నాయా లేదా అనే ప్రశ్న మళ్లీ చర్చనీయాంశంగా మారింది.














Click it and Unblock the Notifications