తెలంగాణలో కొత్త అగ్రికల్చర్ పాలసీ ఇదే.. రైతులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..
తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో సమగ్ర వ్యవసాయ విధానానికి ప్రణాళికలు రూపొందించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకనుంచి రైతులు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు శాస్త్రీయ పద్దతిలో నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలని సూచించారు. తద్వారా వ్యవసాయం లాభసాటిగా మారి రైతులకు మేలు జరుగుతుందన్నారు. గతంలో మాదిరిగా ఇష్టారీతిన పంటలు వేసి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వం రూపొందించిన సమగ్ర వ్యవసాయ విధానాన్ని రాష్ట్రమంతా అమలుచేస్తామని.. ఎక్కడెక్కడ ఏయే పంటలు వేయాలి అన్నది ప్రభుత్వమే మ్యాపింగ్ చేస్తుందని తెలిపారు.
ఇదీ తెలంగాణ విశిష్టత.. దేశానికే అన్నం పెట్టే స్థాయికి..
తెలంగాణ వ్యవసాయ రాష్ట్రంగా అవతరించడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు కేసీఆర్. ఇంత టిపికల్ ల్యాండ్ ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉంటుందన్నారు. అందుకే ఇక్రిసాట్ ఇక్కడ నెలకొల్పారని చెప్పారు. నల్లరేగడి,ఎర్ర రేగడి,క్షార,తెల్ల నేలలు రాష్ట్రంలో ఉన్నాయని... మనది సమశీతోష్ణ మండలం అని.. ఏడాదిలో సగటున 900 మి.మీ వర్షపాతం ఉంటుందని చెప్పారు. అలాగే వరదలు,తుఫానులు,బలమైన ఈదురు గాలులు ప్రకృతి వైపరీత్యాలు వంటివి తెలంగాణలో చాలా తక్కువగా సంభవిస్తాయన్నారు. అందుకే తెలంగాణ పంటల ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తోందన్నారు. దేశానికి,ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతోందన్నారు.
సమగ్ర వ్యవసాయ విధానం..
సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 5వేల ఎకరాల చొప్పున 2604 క్లస్టర్స్ను ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు. ఈ క్లస్టర్స్ అన్నింటిలో రాబోయే రోజుల్లో రైతు వేదికల నిర్మాణం చేస్తామన్నారు. ఇకపై నియంత్రిత పద్దతిలోనే రాష్ట్ర వ్యవసాయ విధానం ముందుకు సాగుతుందన్నారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు,వ్యాపార సంస్థలు,రైతులు,రైస్ మిల్లర్స్.. ఇలా పలు రంగాలకు చెందిన వ్యక్తులతో అనేక భేటీలు నిర్వహించి ఈ విధానాన్ని రూపొందించామన్నారు. దీని ప్రకారం.. ఈసారి వానాకాలంలో 70లక్షల ఎకరాల్లో పత్తి,40లక్షల ఎకరాల్లో వరి,15లక్షల ఎకరాల్లో కంది పండించాలని నిర్ణయించామన్నారు.
అలాగే స్వతహాగా 2లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు చేయవచ్చన్నారు. నిజామాబాద్,నిర్మల్,జగిత్యాల,కేసముద్రం,మహబూబాబాద్ జిల్లాల్లో 1.20 లక్షల ఎకరాల్లో పసుపు పండుతుందని.. దాన్ని కొనసాగించవచ్చునని తెలిపారు. అలాగే డోర్నకల్,మహబూబాబాద్,నర్సంపేట ప్రాంతాల్లో 2.50లక్షల ఎకరాల వరకు ఎండుమిర్చి బాగా పండుతుందని.. కాబట్టి అది కూడా కొనసాగించవచ్చునని చెప్పారు. ఆదిలాబాద్,నిజామాబాద్ జిల్లాల్లో 3.50లక్షల ఎకరాల్లో సోయాబీన్స్ పంటలను కొనసాగించవచ్చన్నారు.అలాగే మామిడి తోటలు,బత్తాయి తోటలు కూడా సాగు చేసుకోవచ్చన్నారు.
ఏ పంటలు వేయాలో ప్రభుత్వమే చెబుతుంది..
నియంత్రిత పద్దతిలో వ్యవసాయానికి రైతులు సహకారించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇష్టమొచ్చిన పంట వేసి ఆగమయ్యే బదులు.. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే వేసి లాభాలు పొందాలన్నారు. పత్తి విస్తీర్ణాన్ని పెంచాలని ప్రాజెక్ట్ కింద,బోర్ల కింద కూడా పత్తిని సాగుచేయాలని చెప్పారు. గతేడాది రెండు పంటలు కలిపి 1కోటి 23 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని.. ఈసారి మరో 10లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరగవచ్చునని చెప్పారు. నియంత్రిత వ్వవసాయ విధానంలో ఏ రకాలు ఎక్కడ సాగుచేయాలో ప్రభుత్వమే చెబుతుందని.. దాని ప్రకారమే రైతులు పంటలు వేయాలని చెప్పారు. వర్షాకాలంలో మక్క పంట వద్దని చెప్పారు. యాసంగిలో మక్క పంట పండిస్తే దిగుబడి పెరిగి లాభం ఎక్కువగా ఉంటుందన్నారు. మక్కకు బదులు వానాకాలంలో కందిని సాగు చేస్తే ప్రభుత్వమే మద్దతు ధరతో వాటిని కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.
Recommended Video
మ్యాపింగ్,ప్రోగ్రామింగ్ సిద్దం..
రైతు బంధు కొనసాగుతుందని.. అయితే ప్రభుత్వం చెప్పిన పంటలు సాగుచేస్తేనే రైతు బంధు అందుతుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్తో పోటీపడేలా రాష్ట్రంలో పండించే వరి గింజలు 6.3మి.మీ పైబడి ఉండేలా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ శాస్త్రవేత్తలు తెలంగాణ సోనా అనే వంగడాన్ని సృష్టించారని.. అంతర్జాతీయ మార్కెట్లో దానికి మంచి డిమాండ్ ఉందని చెప్పారు. అందులో సుగర్ కంటెంట్ కూడా తక్కువగా ఉండటంతో మంచి డిమాండ్ ఉందన్నారు. రాష్ట్రంలో 10లక్షల ఎకరాల్లో దాని సాగుచేస్తున్నట్టు తెలిపారు. నియంత్రిత వ్యవసాయ విధానంలోనూ అన్ని జిల్లాలకు అన్ని పంటలు కేటాయిస్తారని.. దానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి మ్యాపింగ్,ప్రోగ్రామింగ్ సిద్దం చేస్తోందని తెలిపారు.